పార్టీ నిర్మాణ లోపానికి పవనే కారణం .. పవన్ టార్గెట్ గా పార్థసారధి వ్యాఖ్యలు
జనసేన పార్టీ కీలక నేత రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చింతల పార్థసారథి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించి, అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలైన చింతల పార్ధసారధి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగక ఆయన పవన్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు .

పార్టీ సంస్థాగత నిర్మాణ లోపమే పార్టీ నేతల రాజీనామాలకు కారణం
జనసేన పార్టీని స్థాపించి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలోపేతంగా లేదు. బలమైన కేడర్ పార్టీకి లేదు. అంతేకాదు బలమైన నాయకత్వం కూడా పార్టీలో కనిపించటం లేదు. ఇప్పటికీ సంస్ధాగత లోపాలతో నెట్టుకొస్తోంది జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో సత్తా చాటుతుంది అని భావిస్తే ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. స్వయంగా పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండుస్ధానాల్లోనూ ఓటమి పాలు కావడం జనసేన పార్టీ పరిస్థితిని ప్రశ్నార్థకం చేసింది. ఇక ఓటమి బాధ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేస్తారని భావిస్తే ప్రస్తుతం కూడా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగడం లేదు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఒక్కొక్క కీలకనేత పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలలో చేరుతున్నారు.

పార్టీ నిర్మాణ లోపానికి పవన్ కళ్యాణ్ కారణం అంటున్న పార్థసారధి
ఇక తాజాగా పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ అనకాపల్లి ఎంపీ స్ధానం నుండి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చింతల పార్ధసారథి గుడ్బై చెప్పడం మాత్రమే కాకుండా వెళ్తూ వెళ్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. జనసేన లో ఇప్పటికి పార్టీ నిర్మాణం జరగలేదని, దీనికి పవన్ కళ్యాణ్ కారణమని ఆరోపణలు గుప్పించారు పార్థసారథి. పార్టీ సంస్థాగత నిర్మాణం చేస్తే తన అభిమానులు ఇబ్బంది పడతారని ఉద్దేశంతోనే పవన్ పార్టీ నిర్మాణం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.

నాగబాబుకి టికె ఇవ్వటం కుటుంబ పాలన కాదా అని ప్రశ్న
ఇక అంతే కాదు నాగబాబు కు టికెట్ ఇవ్వడం పైన కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కుటుంబ పాలన, కులతత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తానన్న పవన్ కళ్యాణ్ నాగబాబు కు టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో పార్టీకి రాజీనామా చేసిన నేతలు సైతం పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద, ఆయన చుట్టూ ఉండే కోటరీ మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . పార్టీ వీడుతున్న నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో నిజానిజాలు గుర్తించి పవన్ పార్టీ నిర్మాణం కోసం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని జనసేన వర్గాల భావన.

బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించిన పార్థ సారధి
ఇక తాను బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించిన ఆయన ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో జాతీయ భావాలు కల బీజేపీ లో చేరడమే ఉత్తమమని తాను భావిస్తున్నట్లు గా పేర్కొన్నారు. బిజెపి తీసుకున్న నిర్ణయాలతో తాత్కాలికంగా ఇబ్బంది కలిగినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని పార్థసారథి వ్యాఖ్యానించారు. అంతేకాదు బిజెపి లో ఎక్కడా కుటుంబ పాలన కనిపించదని పేర్కొన్న పార్ధసారధి జనసేన పార్టీ తాజా పరిస్థితికి అధినేత పవన్ కళ్యాణ్ తీరే కారణమని సంచలన వ్యాఖ్యలు చేసి పవన్ ను టార్గెట్ చేశారు పార్థ సారధి.












Click it and Unblock the Notifications