మీ సేవ కేంద్రాల్లో పాస్పోర్టు, పోస్ట్ ఆఫీస్లపై యోచన
విశాఖ: మీ సేవ కేంద్రాల్లో ఇక మీదట పాస్పోర్టు సేవలు లభ్యం కానున్నాయి. దరఖాస్తు స్వీకరణ నుంచి రుసుం చెల్లింపు తదితర అంశాలన్నీ ఇక మీదట మీసేవ కేంద్రాల నుంచే చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని 3,600 మీసేవ కేంద్రాల్లో త్వరలోనే పాస్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు విశాఖలోని పాస్పోర్టు కార్యాలయంలో శనివారం జరిగిన శిక్షణా కార్యక్రమంలో సిఎస్సి (కామన్ సర్వీస్ సెంటర్) రాష్ట్ర కోఆర్డినేటర్ రాధాకిషోర్ తెలిపారు.
మీసేవ కేంద్రాల్లో పాస్పోర్టు సేవలు అందుబాటులోకి తెస్తే గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు దార్లకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం అన్ని మీ సేవ కేంద్రాల్లో స్వైపింగ్ మిషన్, ప్రింటర్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాస్పోర్టు దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లింపు సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకోవచ్చన్నారు. పాస్పోర్టు దరఖాస్తుకు మీ సేవ కేంద్రాల్లో రూ.100 నామమాత్రపు ఫీజును వసూలు చేస్తామన్నారు.
ప్రాంతీయ పాస్పోర్టు అధికారి ఎన్ఎల్పి చౌదరి మాట్లాడుతూ.. పాస్పోర్టు సేవల్లో దళారీలను నిరోధించేందుకు మీసేవ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. అప్లికేషన్ పూరించడం నుంచి స్లాట్ బుకింగ్ వరకూ అన్ని సేవలు ఇక్కడ పొందే సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే మీసేవతో పాస్పోర్టు శాఖ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. అలాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా పాస్పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. కసరత్తు జరుగుతోందన్నారు.
పోస్టాఫీస్ సిబ్బందికి పూర్తి శిక్షణనిచ్చి వారి ద్వారా పాస్పోర్టు సేవలు అందించనున్నట్టు తెలిపారు. పాస్పోర్టు దరఖాస్తుల్లో అభ్యర్ధులకు సంబంధించి జనన ధృవీకరణ పత్రాలు నకిలీలు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని విచారించడం తమకు తలకు మించిన భారం అవుతోందని అన్నారు. మీ సేవ కేంద్రాల ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని అంతకుముందు ప్రారంభించారు.