పవన్ కళ్యాణ్ పొత్తు బీజేపీతోనా.. టీడీపీతోనా; క్లారిటీ ఇవ్వాలి: మంత్రి పెద్దిరెడ్డి సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూడటం కోసం అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు సిద్ధమైన సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అందుకు తగ్గట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ పొత్తు ఎవరితో .. క్లారిటీ ఇవ్వండి: మంత్రి పెద్దిరెడ్డి
ఇక దీనిపై వైసీపీ మంత్రులు, నేతలు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పొత్తు లేకుండా పోటీ చేసి గెలిచే సత్తా ఆ రెండు పార్టీలకు లేదని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ లతో కలిసి పోటీ చేస్తారా? లేక బీజేపీ ని వదిలిపెట్టి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా? క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ప్రజల మద్దతు లేదన్న భయంతోనే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాట
ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముసుగుగా మారారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదని అందుకే ప్రజలు తనను తిరస్కరిస్తారని భయంతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని పేర్కొన్న ఆయన, చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కనీసం ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలి
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల మద్దతుతో వైసిపి సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. 2024 ఎన్నికలను 2019 ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జగన్ పాలన చూసి ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారు అని అందుకే ఇప్పటి నుంచే పొత్తుల రాజకీయాలకు తెర తీశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో కనీసం ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబుకు గెలిచే సీన్ లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చిచెప్పారు.