ఎంపీగా పవన్ కళ్యాణ్ ? ఎమ్మెల్యేగా రఘురామ ? సేమ్ నియోజకవర్గంపై చర్చలు !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్... ఈసారి ఇతర పార్టీలతో కలిసి వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల ఎంపికతో పాటు సీట్ల ఎంపిక, ఇతర అంశాల్లో సరికొత్త సమీకరణాలకు తెర దీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు తాను ఈసారి ఎంపీగా బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారని, అలాగే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బాబు-పవన్-రఘురామ బంధం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విపక్షాలు ఏకమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్.. టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే తెలంగాణలో అవసరాల పేరుతో టీడీపీని మళ్లీ అక్కున చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అదే సమయంలో వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎంటర్ టైన్ చేస్తున్నాయి. దీంతో బాబు-పవన్-రఘురామ బంధం కూడా క్రమంగా పెనవేసుకుపోతోంది. ఇది బహిరంగ రహస్యమే అయినా ఈ ముగ్గురు కలిసి కనిపిస్తోంది మాత్రం తక్కువే. అంతా తెరవెనుక జరిగిపోతోంది. ఇదే క్రమంలో మరో కొత్త సమీకరణానికి ఈ ముగ్గురూ పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది.

ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ ?
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఈ రెండు నియోజకవర్గాల గురించి పవన్ ఎక్కువగా ఆలోచించలేదు. అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సరైన నియోజకవర్గం గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ సెట్ కావడం లేదు. దీంతో ఈసారి ఎంపీగా బరిలోకి దిగితే ఎలా ఉంటుందన్న దానిపై జనసేనాని మథనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే పవన్ మిత్రపక్షం బీజేపీ ఈసారి ఉత్తర భారతంలో భారీగా ఎంపీ సీట్లు కోల్పోతుందనే అంచనా ఉంది. దీంతో దక్షిణాదిలో నమ్మకమైన వ్యక్తుల్ని ఎంపీలుగా బరిలోకి దింపడం ద్వారా ప్రయోజనం పొందాలని మోడీ కూడా భావిస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఎంపీగా బరిలోకి దింపేందుకు బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే బరిలోకి రఘురామ ?
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత అదే పార్టీతో విభేదించడమే కాకుండా నిత్యం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామను ఏపీలోకి అడుగు పెట్టనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. తన సొంత నియోజకవర్గం నరసాపురం పరిధిలోకి వచ్చే భీమవరంలో ప్రధాని మోడీ టూర్ కు హాజరయ్యేందుకు శతవిథాలా ప్రయత్నించిన రఘురామ.. అరెస్టు భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు నియోజకవర్గంలో కనీస ప్రయత్నాలు చేసుకోవడం కూడా ఆయనకు సాధ్యం కావడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గంలోని ఓ అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు రఘురామ ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నరసాపురం నుంచే పవన్, రఘురామ పోటీ ?
ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు.. ఈసారి నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన ప్రభుత్వ ఛీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు ఉన్నారు. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి రఘురామ రాజు బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే
నరసాపురం ఎంపీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నరసాపురం ఎంపీ సీటును గతంలో బీజేపీ గెల్చుకుంది. ఇక్కడ క్షత్రియుల జనాభా కూడా ఎక్కువగా ఉంది. అలాగే కాపుల జనాభా కూడా పోటాపోటీగా ఉంది. వీరిద్దరూ కలిస్తే కచ్చితంగా నరసాపురం ఎంపీ సీటును పవన్, ఎమ్మెల్యే సీటును రఘురామ గెల్చుకోవడం ఖాయం. దీంతో ఈ సమీకరణంపైనే ప్రస్తుతం అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications