RTA కార్యాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ తోపాటు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి రాగా, అప్పటికే వందలమందితో కిక్కిరిసి ఉంది. అందరికీ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోపాటు పనివేళలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.00 గంటలకు సమయం కేటాయించారు.
పవన్ నేరుగా వచ్చి రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావును కలిశారు. ముందస్తుగానే స్లాట్లు నమోదు చేసుకోవడంతో వెంటనే పని పూర్తయింది. తర్వాత ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా పవన్ దరఖాస్తు చేశారు. ఒక మెర్సిడెజ్ బెంజ్ కారు, రెండు మహీంద్రా స్కార్పియోలు, టయోటా వెల్ ఫైర్ తోపాటు ఒక జీపు, గూడ్స్ వెహికల్ కూడా ఉందని పాపారావు వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రిజిస్ట్రేషన్ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. ఆ వాహనంతో దిగిన ఫోటోలను పవన్ విడుదల చేశారు. వారాహి వాహనం రంగు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వ్యవహరించలేదని, అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని, వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తిచేశామని అధికారులు తెలిపారు. వారాహి రంగు ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు. రెండు వారాల క్రితమే TS 13 EX 8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తయింది.
ఏపీలో బస్సు యాత్ర కోసం ఈ వాహనాన్ని పవన్ సిద్ధం చేసుకున్నారు. అయితే రంగుకు సంబంధించి వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తికావడంతో నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు స్పష్టమైంది. ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లు పూర్తయిన తర్వాతకానీ, లేదంటే షూటింగ్ విరామంలోకానీ బస్సుయాత్రను ప్రారంభించాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నారు. ఈ యాత్ర కోసమే ప్రత్యేకంగా వాహనాన్ని డిజైన్ చేయించి, హైదరాబాద్ లో రూపొందించారు.












Click it and Unblock the Notifications