శ్రీలంక పరిస్థితికి కూతవేటు దూరంలో ఏపీ: జగన్ పొత్తుల విమర్శలపై పవన్ కళ్యాణ్ చురకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. పొత్తుల రాజకీయాలపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ వైసిపి మాత్రం ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని, జగన్ ను ఎదుర్కొనే సత్తా లేక తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయి అంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతు భరోసా కార్యక్రమంలో పవన్ ను టార్గెట్ చేసిన జగన్
ఇక తాజాగా రైతు భరోసా కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన జగన్ ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమను చూపించాడు అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.
దత్తపుత్రుడి పరామర్శ యాత్రలు అంటూ టార్గెట్
ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో మాట్లాడిన జగన్ ఈమధ్య రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయలుదేరాడని, పట్టాదారు పాస్ పుస్తకం నుండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు అని విమర్శించారు. రైతుల బ్రతుకులను చంద్రబాబు గాలికి వదిలేస్తే అప్పుడు మాట్లాడని దత్తపుత్రుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటూ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మండిపడ్డారు.
శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం : పవన్ కళ్యాణ్
తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంకనుంచి తమిళనాడుకి గంట దూరం అంటూ వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం అంటూ రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది,మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి అంటూ సున్నితంగా చురకలంటించారు.
అప్పుల బారి నుండి ఏపీని గట్టెక్కించండి
ఇంకా పొత్తులు ఖరారు కాని ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి, గడప గడపకి ఎమ్మెల్యేలను పంపి తామేదో చేశామని చూపించడానికి వైసిపి ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను మానేసి రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయాలని, లేదంటే ఏపీ మరో శ్రీలంకగా మారే పరిస్థితి లేకపోలేదని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని మొదటి నుండి ప్రతిపక్షాలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.