చంపుకోవడమా.. వదలొద్దు, ప్రభుత్వం విఫలమైతే చూద్దాం: పవన్ కళ్యాణ్
తిరుపతి: ఇలాంటి సంఘటనల్లో క్రిమినల్స్ను వదలవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు అన్నారు. మూడు రోజుల క్రితం కోలారులో మరో హీరో అభిమాని కత్తితో పొడవడంతో చనిపోయిన తన అభిమాని వినోద్ను పవన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
అభిమాని హత్య: 'అన్నా'.. పవన్పై పడి తల్లి కన్నీరు, చంద్రబాబు జోక్యం చేసుకోవాలి!
ఇలాంటివారిని అసలు వదలవద్దని, కఠినంగా శిక్షించాలన్నారు. రెండు నెలల్లో అమెరికా వెళ్లవలసిన కొడుకు విగతజీవిగా రావడం ఏ తల్లికైనా తీరని శోకం అన్నారు. క్షణికావేశంలో దాడులకు పాల్పడటం సరికాదన్నారు. పోటీతత్వం మంచిదేనని, అయితే ఒకరిని మరొకరు చంపుకునే స్థాయికి కక్షలు వద్దన్నారు.
వినోద్ కుటుంబాన్ని తాను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే ఓ యువకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. క్షణికావేశం కారణంగా ఓ కుటుంబం తన కొడుకును కోల్పోయిందని చెప్పారు.
సీబీఐ విచారణ చూద్దాం
విలేకరులు సీబీఐ విచారణ పైన ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం (కర్నాటక) విఫలమైతే చూద్దామన్నారు. హెచ్చుమీరిన అభిమానం వల్ల ఓ మంచి వ్యక్తిని కోల్పోయామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వినోద్ మృతి బాధాకరమన్నారు. అభిమానం ఆరోగ్యకరంగా ఉండాలన్నారు.
ఏ హీరోతో గొడవల్లేవు
తనకు చిత్ర పరిశ్రమలో సాటి హీరోలు ఎవరితోను గొడవలు లేవని, అసలు పరిశ్రమలో ఏ హీరో కూడా మరో హీరోతో గొడవలు పెట్టుకోరని పవన్ కళ్యాణ్ చెప్పారు. కింది స్థాయిలో అభిమానుల మధ్యే విభేదాలుంటాయన్నారు.
కోలార్ పోలీసులను సంప్రదించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటానని చెప్పారు. హీరోల మధ్య పోటీతత్వం మాత్రమే ఉంటుందని, అది సినిమాలకు మాత్రమే పరిమితమన్నారు. మిగతా విషయాల్లో కలిసే ఉంటామన్నారు.
నా బిడ్డలా చూసుకుంటానన్నారు: వినోద్ తల్లి
పవన్ కళ్యాణ్ పరామర్శించిన అనంతరం వినోద్ తల్లి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తన బిడ్డలాగా తోడుంటానని పవన్ చెప్పారన్నారు. బిడ్డను కోల్పోయిన తల్లి బాధ ఏమిటో తనకు తెలుసునని పవన్ చెప్పారన్నారు. తనకు ధైర్యం చెప్పాడన్నారు.
తన బిడ్డ భగవంతుడి వద్దకు వెళ్లిన తర్వాత కూడా ఇంతటి అభఇమానాన్ని సంపాదించుకున్నాడన్నారు. తన కుమారుడు సమాజ సేవలో పాలుపంచుకునే వాడన్నారు. తన కొడుకు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను బయలుదేరుతానని చెప్పారు. కడుపు మంటతో తన కొడుకును చంపేశారన్నారు. ఇలాంటిది రాష్ట్రంలో జరగడం తొలిసారి అన్నారు. ఇదే చివరిసారి కావాలన్నారు. నా బిడ్డ స్వర్గంలో కూడా పవనిజాన్ని చూపిస్తాడన్నారు.