పవన్ పై జగన్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం...మేమూ వ్యక్తిగత చరిత్రలు బైటకి తీస్తాం: పవన్ అభిమానులు
Recommended Video
కాకినాడ:ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసిపి అధ్యక్షుడు జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై అటు పవన్ అభిమానులు మండిపడుతుంటే...ఇటు వైసిపి లోనూ తీవ్ర అంతర్మథనం జరుగుతోంది.
"కొత్త కారు మార్చినంత ఈజీగా పవన్కల్యాణ్ పెళ్లాల్ని మార్చేస్తాడు...ఇప్పటికే నలుగురిని మార్చాడు... నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. 'నిత్యపెళ్లికొడుకు' అని బొక్కలో వేస్తారా? లేదా?... ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడా?...అంటూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి కారణం అయ్యాయి.
జగన్...ఇంకా ఏమన్నారంటే?
పవన్కల్యాణ్ సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సామర్లకోటలో విలేకరుల సమావేశంలో మంగళవారం వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన, వైసిపి లోనే కాకుండా అన్ని పార్టీలకు చెందిన ఆయా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈయన (పవన్ కల్యాణ్) ఆరు నెలలకు ఒకసారి బయటకొస్తాడు. ఓ రోజు ఓ ట్వీట్ ఇస్తాడు. లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇస్తాడు..పోతాడు.. నాలుగేళ్లుగా మనం చూసింది అంతే. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే.. దానికి మనం సమాధానం చెప్పాలంటే..ఎక్కడున్నాయి విలువలు? విలువల గురించి ఆయన (పవన్ కల్యాణ్) మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు? అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పై ఈ సమావేశంలో ధ్వజమెత్తాడు జగన్.
ఉన్నట్టుండి...దాడి దీనికేనా?
రెండు రోజుల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ వైసిపి అధినేత జగన్ గురించి మాట్లాడుతూ..."జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు... ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆగాలని చెప్పడమే తప్ప... ప్రజా సమస్యలపై ఆయన పోరాడటం లేదు. బంగారంలాంటి అవకాశాలను వినియోగించుకోవడంలేదు. నేను ఉండి ఉంటే...అసెంబ్లీలో వైసీపీలాగా పారిపోయేవాడిని కాదు. ఈరోజు రోడ్లమీద కూర్చుని పోరాడాల్సి వస్తోంది. కానీ, నాకు పది మంది సభ్యులు ఉంటే సభను ఆపేసేవాడిని. ఇంత బంగారంలాంటి అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేశారు"...అన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలే జగన్ ఆయన గురించి మాట్లాడడానికి కారణమయ్యాయని భావించవచ్చు.
పవన్ అభిమానుల నుంచి...తీవ్ర ప్రతిస్పందనలు
కారణాలేమైనా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై పవన్ అభిమానులు వివిధ కోణాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్లా తమ నేత పవన్ కల్యాణ్పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని జనసేన నేత మండలి రాజేశ్ విమర్శించారు. పవన్ గురించి జగన్ వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తే తాము కూడా అవే మాట్లాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. పవన్కు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని మండలి రాజేశ్ విమర్శించారు. "పవన్ కళ్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం....ఆయన వ్యక్తిగత విషయాలు అందరకీ తెలుసు...పవన్ కళ్యాణ్ పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనమే సమాధానం చెబుతారు.పవన్ కళ్యాణ్ తప్పు చేసి ప్రతి వారం ఏమైనా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడా?....ప్రతిపక్ష నేత గా ప్రజలు జగన్ ను ఎన్నుకుంటే ఆయన అసెంబ్లీ వదిలేసి పారిపోయిన వ్యక్తి...ఈయన కూడా పవన్ కళ్యాణ్ పై మాట్లాడం దారుణం"...అని మండలి రాజేష్ మండిపడ్డారు.
మరికొన్ని...హెచ్చరికలు...
"జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. మేం కూడా అదే బాటలో వెళ్తే ఆయన కుటుంబసభ్యులపైనా మాట్లాడాల్సి ఉండవచ్చు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయకూడదనేది జనసేన సిద్ధాంతం. ఇంకోసారి పవన్పై ఇలాంటి కామెంట్స్ చేస్తే జనసేన సైన్యం చూస్తూ ఊరుకోదు. జగన్ ఆర్థిక నేరాలు అందరికీ తెలిసినవే. తెలియని వాటిని బయటపెట్టాలంటే జనసేన కార్యకర్తలకు పెద్ద పనేమీ కాదు"...అని తుమ్మల బాబు అనే జనసేన నేత హెచ్చరిస్తే..."పవన్కల్యాణ్పై వ్యక్తిగత దూషణలకు వెళ్తే జగన్ కుటుంబ చరిత్రా బయటపెడతాం. వ్యక్తిగత దూషణలకు వెళ్లాల్సి వస్తే.. జగన్ గురించీ మాట్లాడాల్సి వస్తుంది. దమ్ముంటే రెండువారాలు నిరంతరంగా పాదయాత్ర చేయాలి. ఎనిమిది నెలలు జైల్లో చిప్పకూడు తిన్న విషయం జగన్ మర్చిపోకూడదు. పవన్కల్యాణ్ వంటి సామాజిక బాధ్యత ఉన్న నేతను విమర్శిస్తే ప్రజల్లో ఏస్థాయి వ్యతిరేకత వస్తుందో ముందు ముందు తెలుస్తుంది"...అని కుంపట్ల విజయ్ గోపాల్ అనే మరో జనసేన నాయకుడు హెచ్చరించారు.
వైసిపిలోనూ...అంతర్మథనం
అయితే జగన్ ఇలా ఉన్నట్టుండి పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడటంతో వైసిపి శ్రేణులు ఆత్మరక్షణలో పడిపోయాయి. కారణం పవన్ సినీ కథానాయకుడు గానే కాకుండా...జనసేన పార్టీ పరంగా...సామాజికంగా ఒక బలమైన వర్గానికి ప్రతినిథి...పవన్ ను జగన్ ప్రత్యేకించి టార్గెట్ చేస్తే...అదీ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే జగన్ పార్టీలోని ఆ సామాజిక వర్గం నేతల్లో చీలిక వచ్చే పరిస్థితి రావచ్చని వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక్క కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్లలో వైసీపీనుంచి కాపు సామాజికవర్గ నేతలే అధికంగా ఆశావహులు ఉన్నారు. ఆ ఆరు చోట్లా కోఆర్డినేటర్లుగా కాపులే ఉన్నారు. ఆ నేతలకే టికెట్లు ఖరారయ్యే పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలతో ఈ వైసీపీ ఆశావహుల్లోనూ ఆందోళన నెలకొన్నట్లు తెలిసింది.