జగన్లా కాదు! బాబు మళ్లీ సీఎంగా ఎందుకు?, మోడీ నా స్నేహితుడా?: పవన్, ‘మొగల్తూరులో తప్పిపోయా’
పశ్చిమగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరసాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఇలా వచ్చి 2019లో తిరిగి వెళ్లిపోదామని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.
బాబు, జగన్లా కాదు..
20ఏళ్లు సినీ పరిశ్రమలో ఉండి.. రాజకీయాల గురించి ఆలోచించలేదని అన్నారు. ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రబాబులా నన్ను, నా కొడుకును సీఎం చేయాలని అనని అన్నారు. ముఖ్యమంత్రి అయితే తప్ప సమస్యలను తీర్చనని వైయస్ జగన్లా చెప్పనని పవన్ అన్నారు. తాను ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు.
15సీట్లు ఇస్తే చంద్రబాబు ఏమిచ్చారు?
పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు 15సీట్లు గెలిపించి ఇస్తే చంద్రబాబు ఏం చేశారని పవన్ ప్రశ్నించారు. రోడ్లు కూడా లేవని అన్నారు. తాను ఓట్లు, సీట్ల కోసం రాలేదని అన్నారు. టీడీపీని ఇన్నేళ్లు చూశారు, వైసీపీ తీరును కూడా చూశారు.. ఈ రోజు మీ ముందుకు వచ్చిన జనసేనకు మీరు అండగా ఉండాలని అన్నారు. తాను ప్రజల కోసం ఏదైనా చేస్తారనే 2014లో చంద్రబాబుకు మద్దతు తెలిపానని చెప్పారు.
2019లో సీఎంని చేయండి..
2019లో సీఎంని కావాలనుకుంటే చేయండి.. సీఎం సీఎం అంటే అవను అని పవన్ అభిమానులతో అన్నారు. తాను సీఎం అయితే మీ ఇంట్లో ఒకడినేనని అనుకోవాలని చెప్పారు. వశిష్ట గోదావరిలో 32టన్నుల చెత్త వేస్తున్నారని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. డంప్ యార్డును కూడా సరిగా నిర్వహించడం లేదని పవన్ మండిపడ్డారు. సీఎం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలిచ్చారని అన్నారు.
మోడీ నాకైమైనా స్నేహితుడా?
చంద్రబాబు అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకుంటే తాము వచ్చావాళ్లమే కాదని పవన్ అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండంటే.. బీజేపీకి మద్దతిస్తున్నారంటారా? అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మోడీ తనకు స్నేహితుడు, బంధువు కాదని.. దేశ ప్రధాని అని అన్నారు. ఆయనంటే తనకు అప్పుడు ఇప్పుడూ గౌరవం ఉందని అన్నారు.
హోదా గురించి అడిగితే అనుభవం లేదన్నారు
తాను గతంలో హోదా అడిగితే బీజేపీతో కలిసి చంద్రబాబు తనది అనుభరాహిత్యమని అన్నారని పవన్ మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు అని తాను అంటే తనపై విమర్శలు చేశారని టీడీపీపై ధ్వజమెత్తారు. జగనేమో టీడీపీకి తోక పార్టీ అని అన్నారని.. ఇప్పుడేమో బీజేపీని వెనుకేసుకొస్తున్నారని అంటున్నారని అన్నారు. తాను ఎప్పుడూ వెనుకబడిన ప్రజలనే వెనుకేసుకొస్తానని అన్నారు.
మొగల్తూరులో తప్పిపోయా
మొగల్తూరులో తమ ఇల్లు చూశానని పవన్ చెప్పారు. ఐదారేళ్లప్పుడు వచ్చానని.. బస్టాండ్ దగ్గర తప్పిపోయానని పవన్ గుర్తు చేసుకున్నారు. గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని.. ఇక్కడ తాగునీరు కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రభుత్వం తీరు ఇలా ఉందని అన్నారు. ఆక్వా ఇండస్ట్రీ వల్ల 15వేల కోట్లు వస్తున్నాయని, పర్యావరణ నష్టం కూడా జరుగుతోందని అన్నారు.
ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ పూర్తి కాలేదు..
60ఏళ్లుగా టీడీపీని గెలిపిస్తే.. వశిష్ట వారధి బ్రిడ్జిని కట్టలేకపోయారని పవన్ అన్నారు. ఎన్టీఆర్ 1984వశిష్ట బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. మాటలు మార్చే వారు చంద్రబాబు అని.. ఆయన అనుభవం జిల్లాకు పనిరాదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా 15సీట్లు ఇవ్వకుంటే మీరు సీఎం అయ్యేవారా? మీ అబ్బాయి లోకేష్ మంత్రి అయ్యి అందరి తలల మీద ఎక్కి తొక్కేవారా? అని చంద్రబాబును పవన్ ప్రశ్నించారు.
చంద్రబాబు మళ్లీ సీఎంగా ఎందుకు?
రాజకీయాల్లోకి తాను పదవుల కోసం రాలేదని అన్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబును మళ్లీ సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలని పవన్ ప్రశ్నించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ.. అన్నీ చూసి వదిలేస్తున్నారా? అని చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి అనుభవంతో కూడిన పాలన ఆశించానని.. అయితే అలా జరగలేదని అన్నారు. మహిళా అధికారులపై దాడి జరిగినా.. క్వారీలో పదులు సంఖ్యలో చచ్చిపోతే బాధ్యత లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేన క్వారీ దగ్గరకు వెళితే గానీ స్పందించరా? అని పవన్ అన్నారు.