పవన్ కళ్యాణ్ పార్టీ: తల్లి హాజరు, గద్దర్కు అహ్వానం?
హైదరాబాద్: తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన కార్యక్రమానికి ఆయన తల్లి అంజనా దేవి హాజరు కావచ్చునని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు మొత్తం దూరమైన నేపథ్యంలో నైతిక మద్దతు కోసం అంజనా దేవి హాజరవుతారని అంటున్నారు. కాగా, తెలంగాణ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్కు కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానం పంపినట్లు సమాచారం.
గద్దర్ పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తే తెలంగాణలో అనూహ్యమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గద్దర్కు ఉన్న ఆదరణ, పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్ కలిస్తే కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆనందసాయి అనే ఆర్ట్ డైరెక్టర్ వేదికకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రవన్ కళ్యాణ్ నిర్వహించే మీడియా సమావేశానికి 2500 మంది అభిమానులను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. మరో 500 మంది ప్రత్యేకాహ్వానితులుగా హాజరవుతారు. 4 వేల మందికి మించి లోనికి అనుమతించబోమని పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తన కార్యక్రమానికి మాజీ ఐఎఎస్, ఐపియస్ అధికారులను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఎన్జీవోలను, ప్రజా కళాకారులను, ప్రొఫెసర్లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది. పవన్ నాలుగైదు రోజుల పాటు హైదరాబాదులో ఉంటారని సమాచారం. వచ్చే వారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి గానీ రాయలసీమలోని అనంతపురం నుంచి గానీ ప్రారంభించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి వెళ్లవద్దని చిరంజీవి అభిమానులను ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో మెగా అభిమానుల్లో చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి అభిమానుల సంఘం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు వేరై విడిగా సంఘాన్ని ప్రకటించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications