కోనసీమలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర-పరామర్శలు- రచ్చబండ-తానున్నానంటూ ధీమా
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పంటలు కోల్పోయి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. ఇందుకోసం పవన్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి కోనసీమ జిల్లాకు వెళ్లారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, పొట్టిలంకలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు పచ్చిమళ్ల శంకరం కుటుంబాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శంకరం మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఆయన భార్య గౌరికి అందచేశారు. శంకరం కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
అనంతరం మండపేటలో పవన్ కళ్యాణ్ రచ్చబండ నిర్వహిస్తున్నారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను కొన్ని నెలలుగా వరుసగా పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటోంది. అయినా ఇప్పటికీ కౌలు రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఆయా కుటుంబాలను వరుసగా పరామర్శిస్తున్నారు. పవన్ రాకతో ఆయా కుటుంబాల్లో ధీమా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా ఆయా కుటుంబాలకు సాయం ప్రకటించాలని పవన్ కోరుతున్నారు.