గోదావరి జిల్లాల్లో పవన్ కొత్త స్ట్రాటజీ - పొత్తులపై క్లారిటీ : నేడే సమరశంఖం..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పైన ఫోకస్ చేసారు. నేడు కీలక సభలో పవన్ పాల్గొంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ పైనా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు పవన్ సిద్దమయ్యారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ కీలకంగా మారనున్నారు. టీడీపీతో పొత్తు పైన అధికారికంగా ప్రకటన చేయకపోయినా.. ఉండే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పొత్తు ఫైనల్ అయ్యే వరకూ నిరీక్షించకుండా.. తన బలం పెంచుకొనే క్రమంలో పవన్ అడుగులు వేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో జనసేన కీలకంగా
అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్ధులు సొంతగా పోటీ చేసి మద్దతు సంపాదించారు. పలు చోట్ల గెలవగా..అనేక చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితుల్లో తనకు అవకాశం ఉందని పవన్ అంచనాకు వచ్చారు. దీంతో..గోదావరి జిల్లాల్లో తనకు వ్యక్తిగతంగా.. కొన్ని సామాజిక వర్గాల మద్దతను మరింతగా పెంచుకొనేందుకు పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ఇందు కోసం ఈ రోజున మండపేటలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అక్కడ జరిగే కౌలు రైతు సభలో పాల్గొంటారు. మధ్నాహ్నం బహిరంగ సభలో పవన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరపున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు.
పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం
రాజమండ్రి నుంచి మండపేట వచ్చే మార్గ మధ్య లో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు కౌలు రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 54 కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరుఫున ఆర్థిక సాయం అందించనుంది. ఇక, సభలో కోనసీమలో రెండు నెలల క్రితం చోటు చేసుకున్న ఘటన పైన ప్రస్తావించే అవకాశం ఉంది.
దీని పైన గతంలోనే ఇదంతా వైసీపీ కుట్రగా పవన్ ఆరోపించారు. ఇక, సీఎం జగన్ దీనిని టీడీపీ - జనసేన కుట్రగా తిప్పి కొట్టారు. దీని పైన పవన్ స్పందించే ఛాన్స్ కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం తనకు మద్దతుగా ఉందని వైసీపీ భావిస్తోందని పలు సందర్భాల్లో పవన్ చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల్లో ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావం చేసే స్థాయిలో ఉన్న కాపు ఓటింగ్ గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు సామాజిక సమీకరణాలు మారుతున్నాయి.
పొత్తులు - పోటీపై తేల్చేస్తారా
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ఓట్ల పైన క్షేత్ర స్థాయిలో జనసేన నేతలు ఫోకస్ పెంచారు. ఇతర వర్గాల ఓట్లను సైతం ఓన్ చేసేకొనే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలు.. తూర్పు గోదావరిలో అయిదు స్థానాలు మినహా అన్ని చోట్ల గెలుపొందింది.
దీంతో..ఈ సారి గోదావరి జిల్లాల నుంచే మరోసారి పోటీ చేయాలని జనసేనాని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తాను పోటీలో ఉండటం ద్వారా రెండు జిల్లాల్లోనూ పార్టీ ఓటింగ్ పైన ప్రభావం చూపిస్తుందనే అంచనాతో ఉన్నట్లు సమాచారం. దీంతో..నేటి మండపేట సభలో పవన్ వచ్చే ఎన్నికలు .. రాజకీయ వ్యూహాలు..తన పోటీకి సంబంధించి సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటుగా ప్రధాని సభకు తాను హాజరు కాకపోవటం.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం పైన స్పందించే ఛాన్స్ ఉంది. దీంతో..పవన్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది.