తిరుపతిలోమున్సిపల్ సీన్ రిపీట్ ? టీడీపీకి పవన్ ముప్పు- మారిన వైసీపీ టార్గెట్
త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికలో ముక్కోణపు పోటీ నెలకొంది. గతంలోలా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంటుందని భావించినా బీజేపీ-జనసేన తరపున రత్నప్రభ ఎంట్రీతో సీన్ మారినట్లే కనిపిస్తోంది. విపక్ష టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధులతో పోలిస్తే వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి రికార్డు మెజారిటీ సాధించాల్సిన పరిస్దితి ఉంది. ఈ మేరకు సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు కూడా. అయితే ఆయన రికార్డు మెజారిటీ సాధించబోతున్నారా ? విపక్ష టీడీపీ, బీజేపీ-జనసేన మధ్య ఓట్ల చీలిక ఆయనకు లాభించబోతోందా ? అదే జరిగితే మున్సిపల్ ఎన్నికల ఫీట్ను వైసీపీ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తిరుపతి ఉపఎన్నిక సిత్రాలు
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపు కొనసాగించక తప్పని పరిస్ధితి ఇక్కడ నెలకొంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా విపక్షాలు తమను ఆడుకోవడం ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే తిరుపతిలో తామే గెలవబోతున్నామని, మెజార్టీలో రికార్డు సృష్టించడమెలా అన్న దానిపై దృష్టిపెట్టినట్లు చెప్పుకుంటోంది. మరి తిరుపతిలో అదే జరగబోతోందా ? లేక విపక్షాలు భారీగా ఓట్లు చీల్చి వైసీపీకి రికార్డు మెజారిటీని దూరం చేయబోతున్నాయా అన్న ఉత్కంఠ నెలకొంది.
టీడీపీని వెంటాడుతున్న జనసేన
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాల్ని మూటగట్టుకుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం కుదేలైంది. దీనికి ప్రధాన కారణం జనసేన. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం సత్తా చూపలేకపోయిన జనసేన.. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో విజయాల తర్వాత కాపు ఓటు బ్యాంకు పోలరైజ్ కావడం మొదలైంది. దీని ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో మరింత పెరిగింది. ఇది మున్సిల్ ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపిందంటే పలు చోట్ల టీడీపీ అభ్యర్ధుల్ని దాటి జనసన అభ్యర్ధులు విజయాలు అందుకోవడం కానీ, లేకపోతే వైసీపీ తర్వాత రెండో స్ధానంలో నిలవడం కానీ జరిగింది. ఇప్పుడు తిరుపతిలోనూ అదే జరిగేలా కనిపిస్తోంది.
నాలుగు సెగ్మెంట్లలో టీడీపీకి జనసేన ముప్పు
ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక జరుగుతున్న లోక్సభ స్ధానం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల జనసేనకు ప్రభావం చూపే స్ధాయిలో ఓట్లు ఉన్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లో బలిజ ఓటు బ్యాంకు బలంగా ఉంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల తరహాలో వీటిని పోలరైజ్ చేసే ప్రయత్నంలో జనసేన కూడా బిజీగా ఉంది. అదే జరిగితే ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ టీడీపీకి లేదా వైసీపీకి పడిన ఈ ఓట్లన్నీ ఈసారి బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్ధి అయిన రత్నప్రభ ఎగరేసుకుపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే టీడీపీ ఖాతాలో మరో ఘోర పరాజయం తప్పదన్న అంచనాలున్నాయి.
బీజేపీ-జనసేనను వైసీపీ టార్గెట్ చేయడం వెనుక ?
గతంలో ప్రధాన విపక్షం టీడీపీని ప్రతీ ఎన్నికల్లో టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ ఈసారి తిరుపతిలో మాత్రం బీజేపీ-జనసేన కూటమిని టార్గెట్ చేసే పనిలో బిజీగా కనిపిస్తోంది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సైతం తిరుపతిలో బీజేపీ-జనసేన కూటమిని ఉద్దేశించి ట్వీట్లు పెట్టడం ద్వారా రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో టీడీపీని కానీ, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిని కానీ వైసీపీ నేతలు విమర్శించడం లేదు. తద్వారా వైసీపీకి అసలు ముప్పు బీజేపీ-జనసేన నుంచే అన్నట్లుగా వాతావరణాన్ని మార్చేస్తున్నారు. దీనికి క్షేత్రస్ధాయి నుంచి అందుతున్న సంకేతాలే కారణమా అన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది.