జగన్! అది మానుకో: పవన్ దిమ్మతిరిగే షాక్, 'సీఎం' నినాదాలతో అసహనం, సంతోషం లేదని..
Recommended Video
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రతి సమస్యకు తాను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తానని చెబుతున్న విపక్ష నేతకు చురకలు అంటించారు.
ప్రధానిని మొదటిసారి కోరిక కోరిన పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. అదే సమయంలో జగన్కు కూడా షాకిచ్చారు.
పాదయాత్రలో జగన్ ఇలా
వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. ఆయన పాదయాత్ర కడప, కర్నూలు జిల్లాలో పూర్తయింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై జగన్ స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తానని చెబుతూ వస్తున్నారు.
సమస్య పరిష్కారానికి కాకుండా అధికారం అనడం ఏమిటి
అంతకుముందు కూడా బహిరంగ సభల్లో మాట్లాడినా, మీడియాతో మాట్లాడినా తాను 2019లో ముఖ్యమంత్రి అవుతానని,అప్పుడు సమస్యలు పరిష్కరిస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీనే కాకుండా కొందరు నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాక చేస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
జగన్! ఆ భావన నుంచి బయటకు రా
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ తీరును తప్పుబట్టారు. అయితే ఆయన నేరుగా కాకుండా పరోక్షంగా స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అయితేనే సమస్యలను పరిష్కరిస్తామనే భావన నుంచి బయటపడాలని హితబోధ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లోకి రావాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
ప్రశ్నించేందుకు నేను సిద్ధం, మీరు సిద్ధమా
ప్రజా సమస్యలపై అధికార పార్టీలను నిలదీసేందుకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్పారు. తద్వారా ప్రతిసారి అధికారంలోకి వచ్చాక అనకుండా, సమస్యలపై తనలా స్పందించేందుకు ముందుకు రావాలని సూచించారు.
వాళ్లలా తప్పించుకోలేనని బీజేపీ, టీడీపీ ఎంపీలకు
డీసీఐ విషయంలో తాను బీజేపీ, టీడీపీల వలే తప్పించుకోలేనని పవన్ కళ్యాణ్ ఆ పార్టీలకు కూడా షాకిచ్చారు. అంతేకాదు విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్లు తప్పించుకోవచ్చునని, తాను అలా చేయలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలా టీ కాఫీలు తాగి కబుర్లు చెప్పనని ఆ పార్టీకి చురకలు అంటించారు.
సీఎం సీఎం నినాదాలతో అసహనం
విశాఖలో మాట్లాడుతుండగా కొందరు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సీఎం అంటుంటే మీకు ఆనందంగా ఉంటుందేమో కానీ తనకు ఉండదని చెప్పారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల కోసం వచ్చానన్నారు. పదవులు రాకపోతే ప్రజలకు సేవ చేయడం మానేస్తామా అన్నారు. తనకు ధైర్యం ఉందని, ఎలాంటి భయం లేదని కూడా చెప్పారు. జనం కోసం రక్తం కారుస్తానని చెప్పారు.