చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్న పవన్ - మాజీ మంత్రి అనుచరులకు హెచ్చరిక..!!
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా పూర్తిగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ అనే అభిప్రాయాన్ని తిప్పి కొట్టేందుకు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే దసరా నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన పవన్.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అటు పొత్తుల అంశం ప్రస్తావిస్తూనే..ఇటు తనంతట తాను సొంతంగా వెళ్లేందుకు సిద్దమనే బలమైన సంకేతాలు ఇస్తున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చి ముందుకు కదులుతున్న పవన్.. టీడీపీ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు.
నాలుగు రోజులుగా వరుస మీటింగ్స్
ఎలాగైనా అధికారం లోకి రావాలని భావిస్తున్న టీడీపీకి తమతో పొత్తు అవసరమని..తమకు సీట్లు - పవర్ విషయంలో పట్టు బిగించేందుకు ఇదే సరైన సమయంగా పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో.. బస్సు యాత్ర ప్రకటన.. ఇప్పుడు పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల గురించి స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన జనసేన నేతలతో పవన్ సమీక్ష చేసారు. రెండు రాష్ట్రాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. నాలుగు రోజులుగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు కార్యక్రమం సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు.
టీడీపీ పై ఒత్తిడి పెంచేలా వ్యూహం
ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పార్టీ నేతల నుంచి వారి సమస్యలపై ఆరా తీసారు. విశాఖపట్నం, రాజోలు, అనంతపురం, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలు..డివిజన్ స్థాయిలో నిర్వహించాలని కార్యక్రమాల పై సూచనలు చేసారు.
మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు పద్ధతి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తమ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి అర్ధరాత్రి ఫోన్లు చేసి.. ఆసభ్యంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మర్యాదలకు భంగం వాటిల్లేలా ఆసభ్యకరంగా మాట్లాడటం తగదని సీరియస్ అయ్యారు.
మాజీ మంత్రి అనుచరులకు హెచ్చరిక
సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలపగా... ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని పవన్ చెప్పుకొచ్చారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదంటూ పవన్ సూచించారు. ఇక, పొత్తుల విషయంలో వైసీపీ మాత్రం ఒకే అభిప్రాయంతో ఉంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయని విశ్వసిస్తోంది. పవన్ తన డిమాండ్లకు అంగీకరిస్తేనే పొత్తు అనే విధంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీంతో..ఇప్పుడు పవన్ రాజకీయంగా వేసే ప్రతీ అడుగు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.