రోడ్ మ్యాప్ ఇచ్చేదేంటి? రాజకీయం తెలీదా? నటనా??
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భారతీయ జనతాపార్టీతో పొత్తులో ఉన్నారు. పొత్తులో ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారుకానీ జనసేన నాయకులు స్పష్టం చేయడంలేదు. తాజాగా ప్రధానమంత్రి మోడీని విశాఖలో కలిసిన పవన్ తమ ఇరుపార్టీల మధ్య పొత్తు ఉందని స్పష్టం చేశారు. గతంలో కరోనా వల్ల తమ రెండు పార్టీల మధ్య కరోనా వల్ల భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోగానే దూరం కూడా తగ్గిపోతుందన్నారు. కానీ కరోనా అనేది సమాజం నుంచి పోదు. ఏదో ఒక రూపంలో ఉంటుంది. అలాగే ఈ రెండు పార్టీలు కూడా పేరుకే పొత్తుతో ఉన్నామంటాయికానీ వారు ఎప్పటికీ కలిసేది లేదు అనే అర్థం వచ్చేటట్లు పవన్ మాట్లాడారు.

పోరాటం తథ్యమన్నారు.. చప్పబడ్డారు!
విశాఖపట్నంలో సంఘటనల తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. స్నేహంగానే ఉన్నామంటూ చాటిచెప్పారు. పవన్ కు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ మొదటి నుంచి బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని, వారు ఇవ్వగానే వైసీపీపై ఉధృతస్థాయిలో పోరాటంచేయడం తథ్యమని ప్రకటించారు.

రోజులు తరిగిపోతున్నా రోడ్ మ్యాప్ రాదు?
సంవత్సరాలు గడుస్తున్నాయి.. నెలలు దొర్లిపోతున్నాయి.. రోజులు తరిగిపోతున్నాయికానీ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ రాలేదు. అసలు రోడ్ మ్యాప్ ఇచ్చే ఉద్దేశమే లేని పార్టీ ఎందుకిస్తుందని పవన్ భావిస్తున్నారో ఆయనకే తెలియాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కు అన్నీ తెలిసే నాటకాలాడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శిస్తున్నారు. బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతుంటే ఆయన్ని అమాయకుడు అనుకోవాలా? అన్నీ తెలిసే నటిస్తున్నారా? అని ప్రశ్నించారు. మంత్రుల బ్లాక్ మెయిల్ కు పవన్ భయపడుతున్నారని, ఏపీలో వైసీపీకి బీజేపీ పూర్తిగా సహకరిస్తోందన్నారు.

జనసేన సెపరేట్ అంటున్నారేంటి?
వైసీపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక వేదికపైకి రావాలని చెప్పిన పవన్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి అదే విషయం చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ప్రకటించిన జనసేనాని మోడీ విశాఖ పర్యటన ముగిసిన తర్వాత జనసేన సెపరేట్ అంటున్నారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తే చివరకు ఎదురుచూపులే మిగులుతాయని, బీజేపీ తన స్వప్రయోజనాల కోసమే జనసేనను తన ఉక్కు పిడికిలిలో బంధించిందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ కావాలి.. రాష్ట్రంలో వైసీపీ ఉండకూడదంటే జరగదని, ఒకటి కావాలంటే మరికొటి వదులుకోవాలని, అది నిర్ణయించుకోవాల్సింది కూడా పవనేనని సీనియర్ రాజకీయవేత్తలు సైతం చెబుతున్నారు.












Click it and Unblock the Notifications