ఎక్కడ చూసినా: టిపై పవన్, రాజకీయం కాదు: డిగ్గీ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం పైన స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న శుభసమయాన అమరుల త్యాగాలను గుర్తుంచుకుందామని పవన్ ట్వీట్ చేశారు. ఎక్కడ చూసినా బాణాసంచా పేలుళ్లు, జై తెలంగాణ నినాదాలు వినిపిస్తున్నాయని, 60 ఏళ్ల కల నిజమైన శుభసమయం ఇదన్నారు.
వెంకయ్య శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు బిజెపి, కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కలిసి శ్రమిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. తెలంగాణకు కేంద్రం పూర్తిగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
రాజకీయం లబ్ధి కాదు: దిగ్విజయ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణను ఏర్పాటు చేశఆమన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి పేరు మార్చడం సరికాదన్నారు.
హైదరాబాద్ కమిషనర్గా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
హైదరాబాదు పోలీస్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు నగర కమిషనర్గా ఉన్న అనురాగ్ శర్మ తెలంగాణ డీజీపీగా నియమితులయ్యారు. దీంతో నగర్ పోలీస్ కమిషనర్గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడారు.
హైదరాబాద్ పదేళ్లు కామన్ కాపిటల్గా ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని చెప్పారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా హైదరాబాదుకు లింక్ అన్నట్లుగా వార్తలు వస్తాయని కానీ అది వాస్తవం కాదన్నారు. తాను ఐదేళ్ల పాటు ఇంటెలిజెన్స్లో పని చేశానని చెప్పారు. ప్రతి దానిని హైదరాబాదుకు అంటగట్టొద్దన్నారు.