"అప్పుడు కడుపు మండలేదా?.. ఓట్లు చీల్చేందుకే వచ్చావ్.. ముసుగు తొలగించు.."
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలపై వైసీపీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు వైసీపీని దెబ్బతీసేందుకే ఆయన రాజకీయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చడానికే పవన్ కళ్యాణ్ కొత్త నాటకానికి తెరదీశారని ఆరోపించారు. పవన్ ఎన్ని డ్రామాలు, పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

అడ్డపడింది మీరు కాదా?:
నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. సీఎం కాలేరు కాబట్టే పవన్ సీఎం పదవి వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తన తీరును తానే ప్రశ్నించుకోవాలని సూచించారు.
అప్పుడప్పుడు ప్రశ్నించేవారికి బాధ్యతలపై ఏం చిత్తశుద్ది ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు లేనిది.. ఇప్పుడొచ్చి హఠాత్తుగా ప్రశ్నించడం మీ అతి తెలివి కాదా?.. 'ప్రత్యేకహోదాకు అడ్డుపడింది మీరు కాదా?' అని సూటిగా ప్రశ్నించారు.
Recommended Video


అప్పుడు కడుపు మండు లేదా?:
నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని, అప్పుడు మీకు కడుపు మండలేదా? అని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. పీఆర్పీ పార్టీ విషయంలో మీ కడుపు మండితే.. మరి నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న అవస్థలు చూసి కడుపు మండలేదా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఏ నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

టీడీపీ మేనిఫెస్టోపై మీ బొమ్మ లేదా?
టీడీపీ మేనిఫెస్టోపై మీ బొమ్మ లేదా? అని ప్రశ్నించిన వాసిరెడ్డి పద్మ..చంద్రబాబు ఇచ్చిన 600 ఎన్నికల హామీలకు మీరు బాధ్యులు కారా? అని నిలదీశారు. టీడీపీ-బీజేపీ పాలనలో మీకు బాధ్యత ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టి.. ఇప్పుడేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు.

అందుకే వచ్చావ్:
2019ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకే పవన్ కొత్త నాటకానికి తెరదీశారని పద్మ ఆరోపించారు. ఇప్పటికైనా ముసుగు తొలగించుకోవాలని సూచించారు.బమూడేళ్లలో చంద్రబాబు లక్షా 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాజకీయాలంటే సినిమాలు కాదని గుర్తుంచుకోవాలని సూచించారు.
ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఎందుకు కలిపారు? అని ప్రశ్నించిన పద్మ.. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలను ఎందుకు మోసం చేశారని అన్నారు. వైఎస్ జగన్ మీలాగా ప్యాకేజీలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications