మూడో కన్ను: చిరంజీవికి వెంకయ్య ప్రశంస, పవన్ కళ్యాణ్ చురకలు
నెల్లూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పైన ఆదివారం ప్రశంసలు కురిపించారు. చిన్నప్పుడు ఎన్టీఆర్ గుండమ్మ కథ, మాయాబజార్, ఏఎన్ఆర్ సువర్ణసుందరి సినిమాలను చూశానని, తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు రెండు కళ్లైతే, మూడో నేత్రం చిరంజీవి అని కితాబిచ్చారు.
అత్తారింటికి దారేది మూడుసార్లు చూశా
తాను సినిమాలు చూడడం అతి తక్కువ అని, చూసినా రెండోసారి ఏదీ చూడలేదని, అలాంటిది పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా మూడుసార్లు చూశానని చెప్పారు. పవన్ అద్భుతంగా చేశారన్నారు. సాంకేతిక అభివృద్ధిలో భారత్ విశ్వగురువుగా అవతరించాల్సి ఉన్నదని ఆకాంక్షించారు. దేశంలో అభివృద్ధి ఆగిపోయి ఆర్థికశక్తి సన్నగిల్లి అంధకారంలో ఉన్న పరిస్థితుల్లో చీకటిలో చిరుదీపంలా నరేంద్ర మోడీ నాయకత్వం లభించిందని చెప్పారు.
మోడీ నాయకత్వం దేశానికి కావాలని కోరుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకరని, ఆయన యువ కెరటమని, పదవుల కోసం ఎన్నడూ పవన్ ప్రయత్నాలు చేయలేదన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమ పడుతున్నారని కితాబిచ్చారు. యువత ఆయనని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్ అంటే ఫొటోలు తీసుకోవడం కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే పరిశుభ్రమైన సమాజం అవతరిస్తుందని అన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారం కోసం తెలుగు రాష్ర్టాల నుంచి ఎంపిక చేసిన ప్రముఖుల్లో ఒకరైన పవన్ కళ్యాణ్, తొలిసారి ఈ కార్యక్రమంపై స్పందించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.
తనదైన శైలిలో నేతలకు చురకలు అంటిస్తూ పవన్ ప్రసంగం సాగింది. స్వచ్ఛ భారత్ అంటే భారతీయ జనతా పార్టీనో, ప్రధాని మోడీనో కాదన్నారు. ప్రతి భారతీయుడి భాగస్వామ్యం ఉన్నప్పుడే అది సాధ్యమన్నారు. సంవత్సరంలోనో లేదంటే ఐదేళ్లలోనో భారత్ను పరిశుభ్ర దేశంగా మార్చడం కుదిరే పని కాదన్నారు. భారతదేశం ఉన్నంతకాలం ఈ కార్యక్రమం కొనసాగాలని చెప్పారు.
స్వచ్ఛ భారత్ గురించి మోడీ మాటలు విన్నప్పుడు నేను కూడా అనుమానించానని, ఇది సాధ్యమా అని అనిపించిందని, అయితే, దాన్ని సాధ్యం చేయడం ఒకరిద్దరితోనే అయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యత పడాల్సి ఉంటుందని ఆ తరువాత తెలుసుకొన్నానని, అందువల్లనే తన వంతుగా నేను స్వచ్ఛభారత్లో పని చేస్తానని, నా అభిమానులకు కూడా ఇదే పిలుపునిస్తున్నానని చెప్పారు.
దేశంలో ఇల్లు లేకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్లు కనిపిస్తున్నాయని, కానీ, కనీస అవసరాలను మాత్రం తీర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరంగా దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది కానీ, అదేదీ మనిషి అవసరాలకు ఉపయోగపడడంలేదన్నారు. ఇప్పటికీ ఆడబిడ్డలకు మరుగుదొడ్లు లేవు. ఉన్నావాటికి తలుపులు లేవని వాపోయారు.
వెంకయ్య సిద్ధాంతం కోసం నిలిచే నేత అని, విభజనపై ఆయన ఒక్కరే పార్లమెంటులో పోరాడారన్నారు. నేను నెల్లూరులోనే పుట్టి పెరిగానని, చిన్నతనం నుంచి వెంకయ్యను చూస్తున్నానని, మా నాన్న ఆయనతో కలిసి జై ఆంధ్రా ఉద్యమంలో పోరాడారని, లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ను వెంకయ్య నెల్లూరుకు తీసుకువచ్చారని చెప్పారు. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకున్న యువకులు ఉన్నత శిఖరాలను అందుకుంటారన్నారు.
అందుకు మహారాష్ట్ర యువ ముఖ్యమంత్రి దేవేందర్ర ఫడ్నవీసే మంచి ఉదాహరణ అని పవన్ అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని అనంతరం మాట్లాడిన ఫడ్నవీస్ అన్నారు. క్రమశిక్షణ కలిగినవారే విజయాలు అందుకుంటారు. నటుడు పవన్ కళ్యాణ్లో ఈ గుణాన్ని తాను చూశానని, ఆయన అభిమానులు సైతం.. అదే బాటలో నడవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications