రోజాకు నచ్చేలా, జగన్ మెచ్చేలా: పవన్ కళ్యాణ్ వైసిపి పావుగా మారారా!?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతోషించేలా గురువారం ప్రత్యేక హోదాపై స్పందించారు. ప్రత్యేక హోదాపై గతంలోను టిడిపి - బిజెపిలను విమర్శించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతోషించేలా గురువారం ప్రత్యేక హోదాపై స్పందించారు. ప్రత్యేక హోదాపై గతంలోను టిడిపి - బిజెపిలను విమర్శించారు.
కానీ గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ స్పందించిన సమస్యలను తరిచి చూస్తే.. జగన్కు కౌంటర్గా టిడిపి తెరపైకి తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోందని వైసిపి పలుమార్లు అనుమానం వ్యక్తం చేసింది.
పవన్ కళ్యాణ్ - జగన్ ఒక్కటవుతారా?
అయితే, చాన్నాళ్లకు పవన్ జగన్ సంతోషించేలా, వైసిపి నేతలు మెచ్చేలా ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై తన తాజా ట్వీట్లో టిడిపిపై విమర్శలు గుప్పించి, వైసిపి నేతలపై ప్రశంసలు కురిపించారు.
గతంలో ప్రత్యేక హోదా విషయంలో ఎక్కువగా బీజేపీని, అప్పుడప్పుడు టిడిపిని పవన్ నిలదీసేవారు. అదే సమయంలో సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ వాటిని వైసిపి వేలెత్తి చూపించేది.
పవన్ ఏ సమస్యపై స్పందించినా.. ఆయన టిడిపి పావు అవి, చంద్రబాబు నాటకంలో భాగంగా ఆయన తెరపైకి వస్తున్నారని రోజా వంటి వైసిపి నేతలు మండిపడేవారు. పవన్ కళ్యాణ్ రబ్బర్ సింగ్ అని రోజా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో వైసిపిని ప్రశంసించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో వైసిపి ప్రశ్నించిన సాక్షి కట్టింగ్ను పవన్ పోస్ట్ చేశారు.
మరి ఇన్నాళ్లు టిడిపి ఆటలో భాగంగా పవన్ తెరపైకి వచ్చారని చెప్పిన వైసిపి, ఇప్పుడు జగన్ వ్యూహంలో భాగంగా టిడిపిని తెగిడి, తమ పార్టీని పొగిడాయని చెబుతాయా అని ప్రశ్నిస్తున్నారు.