రాష్ట్ర ఆదాయం ఎటు పోతుంది ; ప్రభుత్వోద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లపై పవన్ కళ్యాణ్ ప్రశ్నాస్త్రాలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు వైసిపి సర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పింఛన్లు ఏవి అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వానికి లోపించిన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఒకటవ తేదీన జీతాలు వస్తాయనే విషయం మర్చిపోయారని ఆరోపించారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పిందని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.
తాకట్టులో ఆంధ్రప్రదేశ్: మౌలిక ఆర్థిక సూత్రాన్ని మరిచిన వైసీపీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్
రాష్ట్రంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న పవన్ కళ్యాణ్
ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి రాష్ట్రంలో చోటు చేసుకుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పించన్లు అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కష్టాలు తమకు తెలుసని, వారికి వచ్చే జీతాలతో, పింఛన్ తో ఆత్మాభిమానంతో జీవనం సాగిస్తారని, ప్రస్తుతం వారి ఆత్మాభిమానానికి ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగి తన జీతాన్ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తారని బ్యాంకు రుణాల వాయిదాలు, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వైద్య అవసరాలు ఇలా వచ్చే ఆదాయంతో వారికి నెలసరి ఖర్చులకు సంబంధించిన ప్లాన్ వుంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పోలీసులు కూడా టీఏలు, సరెండర్ లీవ్ ల డబ్బుల రాక ఇబ్బంది పడుతున్నారు
ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వకపోతే వారు ఎంతకాలం చేబదుళ్ళతో నెట్టుకొస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది నిరంతరం విధులు చేస్తూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి 11 నెలలుగా టిఏ చెల్లించలేదని, వారి సరెండర్ లీవ్ లకి రావలసిన సొమ్ము కూడా ఇంతవరకు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. వారి కోసం అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో తాను మాట్లాడానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఎవరి జీతాలు ఇవ్వకుండా, వారికి చెల్లించాల్సిన బకాయిలను ఆపి జగన్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
జీత భత్యాలు చెల్లించలేని పరిస్థితికి కారణం ఏమిటి? పవన్ కళ్యాణ్ ప్రశ్న
రాష్ట్రంలో పీఆర్సీ అమలు చేయడం లేదని, ఇప్పటివరకు ప్రభుత్వం ఉద్యోగులకు 7 డీఏలు బకాయి పడిందని, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, డిఏలు, టిఏలు పిఆర్సి లు అడగరని, జీతం వస్తే చాలు అదే పదివేలు అనుకుంటారన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రతినెలా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి అని, అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉండటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.
గతం కంటే పెరిగిన ఆదాయం .. అయినా ఆదాయం ఎటు పోతుందని పవన్ ప్రశ్న
ఇక విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది అన్న పవన్ కళ్యాణ్ దశాబ్దాలపాటు సర్వీస్ చేశాక విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకునుకొంటారని, ఆ వయసులో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, వారికి పింఛన్లు డబ్బులే ప్రధాన ఆదాయ వనరు కాబట్టి పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే రిటైర్డ్ ఉద్యోగులు మనోవేదనకు గురవుతారన్నారు. రాష్ట్రానికి గతంతో పోలిస్తే అదనంగా ఆదాయం వస్తున్నా, కనీసం ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు, పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు జీతభత్యాలు, పెన్షన్లు ఇవ్వలేనంతగా రాష్ట్ర ఆదాయం ఎటు పోతుంది అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రతినెలా తీసుకొస్తున్న అప్పులను ఏం చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.