కడిగేస్తున్నారు!: పార్టీలో ఉంటూ ఒకరు, మద్దతిచ్చి ఇంకొకరు
హైదరాబాద్: అధికార తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు పార్టీలో ఉంటూ ఒకరు, పార్టీకి మద్దతిచ్చి నిలదీస్తున్నారు! రాజధాని భూముల పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీకి ప్రత్యేక హోదా పైన హీరో, బీజేపీ నేత శివాజీ నిత్యం అధికార పార్టీని నిలదీస్తున్నారు. విపక్షాల నిలదీత విషయాన్ని పక్కన పెడితే.. వీరు ప్రశ్నించడం జనాలలో చర్చనీయాంశమవుతోంది.
సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. కొద్ది నెలల వరకు బయటకు రాలేదు. అయితే, రాజధాని కోసం భూసమీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ నెలన్నర రోజుల క్రితం బయటకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూమి ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతుల నుండి చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా తీసుకోవద్దని హెచ్చరించారు.
అనంతరం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులకు భరోసా కల్పించారు. రైతులు, రాజధాని ప్రాంత వాసులు కూడా ఒక విధంగా పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ భరోసా పెట్టుకున్నారనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పైన పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం మరోసారి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతుల తరఫున అవసరమైతే తాను రోడ్డెక్కుతానని చెప్పారు.

మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన నటుడు శివాజీ... ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై గత కొద్ది రోజులుగా పోరాడుతున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ అయిన బీజేపీని కూడా ఈ విషయమై నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ హామీ నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
అంతకుముందు తెలుగుదేశం పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ.. శివాజీకి పార్టీతో సంబంధం లేదని, ఆయన మాటలతో తమకు సంబంధం లేదని చెప్పారు.
సోము వీర్రాజు వ్యాఖ్యల పైన కూడా శివాజీ ఘాటుగానే స్పందించారు. తాను పార్టీలో లేనని చెప్పేందుకు వీర్రాజు ఎవరని ప్రశ్నించారు. మొత్తానికి రాజధాని పైన పవన్ కళ్యాణ్, ఏపీకి ప్రత్యేక హోదా పైన నటుడు శివాజీ టీడీపీ - బీజేపీ ప్రభుత్వాలను ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications