మున్సిపల్ పోల్స్ ఫలితాలపై స్పందించిన పవన్- బెదిరింపులతోనే వైసీపీ గెలుపు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ ప్రభావం లేకుండా పోయిన ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ గెలుపుపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విశ్లేషించారు. ఇందులో వైసీపీ గెలుపు వెనుక కారణాలను ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పుడు పవన్ స్పందన చర్చనీయాంశంగా మారింది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్ధానాల్లో గెలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని పవన్ ఆరోపించారు. రేషన్ కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు పవన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రజలకు భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని పవన్ తెలిపారు. ప్రజల కడుపు మీద కొట్టి తిండి లాక్కొంటామని బెదిరించడం వల్లే వైసీపీ గెలిచిందన్నారు.
ఏపీలో ఇవాళ వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలిసారిగా జనసేన పలుచోట్ల విజయాలు అందుకుంది. తొలిసారి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన దాదాపు ప్రతీ కార్పోరేషన్, మున్సిపాలిటీలోనూ కనీసం ఒకట్రెండు స్ధానాలు సాధిస్తోంది. అమలాపురం మున్సిపాలిటీలో అయితే ఏకంగా టీడీపీని సైతం వెనక్కి నెట్టి ఆరు స్ధానాలు కైవసం చేసుకుంది. విజయవాడ, విశాఖ వంటి చోట్ల టీడీపీతో పరస్పర అవగాహన చేసుకుని జనసేన అభ్యర్ధులు విజయాలు సాధించారు. దీంతో ఫలితాల తీరుపై అంతర్గతంగా జనసేనలో సంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.