Pawan Kalyan : వాలంటీర్లపై వ్యాఖ్యల్ని సమర్ధించుకున్న పవన్-మరో కొత్త డిమాండ్..
జనసేన కమిటెడ్ కేడర్ ఆధారిత పార్టీ అని, నేతల బేసెడ్ క్యాడర్ కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజోలులో ఎమ్మెల్యే వెళ్లిపోతే పార్టీని క్యాడర్ కాపాడుకుందన్నారు. నేతల్ని గెలిచినప్పుడు కాదని ఓటమి చెందినప్పుడే చూడాలన్నారు. జనసేన ఓటమి తర్వాత కూడా ఎలా ఉందో పార్టీ క్యాడర్ ఓసారి చూడాలన్నారు. వైసీపీకి బైబై చెప్పాలంటే జనసేన వంటి బలమైన క్యాడర్ అవసరం అన్నారు. జగన్ గొప్ప నాయకుడైతే తనకు మించి సంతోషించే వారు ఎవరూ ఉండరన్నారు.
ఏలూరు డిగ్రీ కాలేజీ దగ్గర విద్యార్ధులు చెట్ల కింద ఉన్నారని, బ్రిటీష్ వాళ్లు కూడా తమ అవసరాల కోసం కాలేజీలు నిర్మించారని పవన్ గుర్తుచేశారు. జగన్ వంటి నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఓ ముఖ్యమంత్రి స్ధాయి నాయకుడు తనతో పాటు తన భార్యపైనా విమర్శలు చేస్తున్నారన్నారు. మధ్యయుగాల్లో సైతం ఆడవాళ్ల జోలికి ఎవరూ వచ్చేవారు కాదన్నారు. గతంలో చంద్రబాబు సతీమణిని తిట్టారని, అది వారింటి సమస్య మాత్రమే కాదన్నారు.

వాలంటీర్ల జీతం 5వేలు మాత్రమేనని,వారి పొట్ట కొట్టాలని తనకు లేదని పవన్ అన్నారు. ఐదు వేల రూపాయలకు వాలంటీర్లను కట్టేస్తే అందులో ఓ ఇంజనీర్, శాస్త్రవేత్త కావాలనుకునే వారిని కట్టిపారేస్తున్నారని విమర్శించారు. వారికి ఐదు వేలు ఇచ్చి ఊడిగం చేయించుకుంటున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే డబ్బుల్ని కూడా వాలంటీర్లకు ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ, రెవెన్యూ వ్యవస్ధలతో పాటు రాజకీయ వ్యవస్ధల్ని కాదని ఐదు వేల చొప్పున ఇచ్చి నాలుగో వ్యవస్ధను జగన్ పెట్టారని పవన్ విమర్శించారు. వారిని జగన్ శ్రమదోపిడీ చేస్తున్నట్లే అన్నారు.
ఢిల్లీలో కూర్చున్న పెద్దలు, నిఘా సంస్ధల వ్యక్తులు ఏపీలో ఇన్ని వేల మంది అమ్మాయిలు మిస్సవుతున్నారని ఓ పార్టీ అధినేత తనను అడిగారని పవన్ తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే కొంత మంది కుమ్మక్కయ్యారని తనకు చెప్పారన్నారు. ఎన్సీఆర్బీ డేటాలో 30 వేల మంది మిస్సయ్యారని, వారిలో 14 వేల మంది తిరిగి ఇళ్లకు వచ్చారని, దీనిపై కేంద్ర నిఘా వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని తనకు చెప్పారన్నారు. అపార్ట్ మెంట్లో టూలెట్ బోర్డు పెడితే ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్లకు ఊరికే అద్దెకివ్వరని, ఎన్నో విషయాలు ఆలోచిస్తారని పవన్ తెలిపారు.
వాలంటీర్లలో మహిళల గురించి తాను మాట్లాడటం లేదని, బ్యాచ్ లర్లకు డేటా సేకరణ బాధ్యత ఇచ్చారని, వారి దగ్గర కుటుంబాల డేటా చాలా ఉంటోందని పవన్ తెలిపారు. జగన్ వాలంటీర్ల వ్యవస్ధ మొదలుపెట్టినప్పుడు వారి ఉద్దేశం వేరై ఉండొచ్చని, కానీ సమాచారం అనేది చాలా సున్నితమన్నారు. గ్రామాల్లో తల్లితండ్రులు ఇళ్లలో లేనప్పుడు మహిళల సున్నితమైన డేటా తీసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ వ్యవస్ధలుండగా వాలంటీర్ల పేరుతో మరో సమాంతర వ్యవస్ధ ఎందుకన్నారు.
ఐదు వేల రూపాయలు తీసుకునే వాలంటీర్లలో కొంతమంది తప్పుచేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని పవన్ ప్రశ్నించారు.
వాలంటీర్ల డేటా తీసుకునే హక్కు అందరికీ ఉండాలన్నారు. ప్రతీ ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల్లో వాలంటీర్ల డేటా పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. ముసలి తల్లితండ్రుల్ని మీ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు కదా అంటూ కొందరు వాలంటీర్లు బెదిరిస్తున్నారని పవన్ వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్ధను జాగ్రత్తగా చూడాలన్నారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాళ్ల పని చేస్తే ఇబ్బంది లేదని, ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తామంటే కుదరదన్నారు.












Click it and Unblock the Notifications