వీడియోలు రిలీజ్ చేస్తా, బాబు ఉలిక్కిపాటు, బీజేపీతో నేనే కలిస్తే..: పవన్కు కొత్త అనుమానాలు
దేవరపల్లి: తెలుగుదేశం పార్టీ నేతలు తనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దత్తపుత్రుడిగా చెబుతున్నారని, ఆయన దత్తపుత్రుడిని కాదని, కొణిదెల వెంకట్రావు కొడుకును అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీకి జగన్ అవినీతిపుత్రుడు, పవన్ దత్తపుత్రుడు అనే మాటలు టీడీపీ నేతలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
2014 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరమని ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా కోరినా తాను వెళ్లలేదన్నారు. ఆయన దేవరపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. తాను గత ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా మద్దతు ఇచ్చానని చెప్పారు. అప్పట్లో మద్దతు కోరుతూ చంద్రబాబే తన వద్దకు వచ్చారన్నారు.

వీడియోలు విడుదల చేస్తా
ప్రధాని నరేంద్ర మోడీ నాకు ఏమైనా అన్నయ్యనా, అమిత్ షా నాకు ఏమైనా పెదనాన్ననా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మొదట నిలదీసింది తానే అన్నారు. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అని నేను అంటే బీజేపీతో కలిసి టీడీపీ తనపై విమర్శలు చేసిందన్నారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అంబారీలను ఎక్కించి బీజేపీ వాళ్లకు సన్మానాలు చేసింది ఎవరని నిలదీశారు. హోదాపై నేను ఏమన్నాను, చంద్రబాబు ఏమన్నారో వీడియోలు విడుదల చేస్తానని చెప్పారు. మాట మార్చి ఎన్నికల కోసం ఇప్పుడు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారన్నారు.
Recommended Video

చంద్రబాబు ఉలిక్కిపాటుపై పవన్కు కొత్త అనుమానాలు
తాను మద్దతిచ్చినప్పుడు తనను దేశభక్తుడు అని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అవినీతిని ప్రశ్నిస్తున్నానని తనపై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారో చెప్పాలన్నారు. దీనివల్ల వచ్చే ఎన్నికల కోసం వారి వద్ద ఆయన సొమ్మును దాచుకుని ఉంటారనే అనుమానం కలుగుతోందని చెప్పారు.

ఆ ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాలి
జన సైనికులకు చెందిన 18 లక్షల మంది ఓట్లను రాష్ట్రంలో తొలగించేశారని పవన్ అన్నారు. జనసైనికులంతా తమ ఓటును మళ్లీ నమోదు చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. 2014 ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు రూ.3.5లక్షల కోట్లు దోచారని జగన్, జగన్ రూ.లక్షన్నర కోట్లు దోచేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు. ఆ ఇద్దరూ చెప్పిన రూ.5లక్షల కోట్ల సొమ్మును ప్రజలకు పంచాలన్నారు.
బీజేపీ వాళ్లతో కలిసి పీఠం లాక్కునేవాడిని
ముఖ్యమంత్రి కావడం దైవసంకల్పం అని తాను నమ్ముతానని పవన్ అన్నారు. అంతకంటే కోట్లమంది ప్రజల హృదయాల్లో నాకు ఉన్న స్థానమే విలువైనదన్నారు. అంతే కానీ పాడు తెలివితేటలతో నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకోవడం లేదన్నారు. అలా అనుకుంటే బీజేపీ వాళ్లతో కలిసి చంద్రబాబు పీఠాన్ని ఎప్పుడో లాక్కునే వాడినని చెప్పారు. అలాంటి దిగజారుడు ఆలోచన తనకు లేదన్నారు. ఏదైనా ప్రజల ద్వారా రావాలని, ప్రజా విప్లవం ద్వారా రావాలన్నారు. నేను 2014లో టీడీపీకి మద్దతిస్తే పవన్, ఆయన అభిమానులు దేశభక్తులు అని, అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ పైడిపాక గ్రామాన్ని బుధవారం సందర్శించారు.












Click it and Unblock the Notifications