కాపులు శాసించే స్థాయికి .. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చర్చ, పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఎక్కడ ?
పంచాయతీ పోరు.. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల సమరం. స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికలు పేరుకే పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. కానీ అసలు రాజకీయమంతా పంచాయతీ ఎన్నికల్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు సత్తా చూపిస్తాయి అనే భావన ఉంటుంది. ఇదిలా ఉంటే ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాయి .

ఇంతవరకు పంచాయితీ ఎన్నికలపై విధానం ప్రకటించని జనసేన పార్టీ
ఒకపక్క పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా ఎక్కువ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే, బిజెపి, జనసేన ఇంకా సరైన విధానంతో ముందుకు రాలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై మాత్రం బిజెపి, జనసేన నాయకులు పోరాటం చేస్తున్నారు. గవర్నర్ ను కలిసి మరీ ఫిర్యాదులు చేశారు . ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటు లేకపోయిన జనసేన ఈసారి పంచాయతీ ఎన్నికలలో అయినా పట్టు నిలుపుకుంటుందా అంటే ఇప్పటివరకు అర్థంకాని పరిస్థితి.

కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని కలవడంతో ఆసక్తికర చర్చ
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని కలవడం, కాపులు శాసించే స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. కాపు సామాజిక వర్గం నుండి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గమే ఆదరించిన దాఖలాలు లేవు. అన్ని స్థానాల్లోనూ ఓడించి, కేవలం ఒక్క స్థానానికే జనసేన ను పరిమితం చేసింది. ఇక ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో కూడా జనసేన హడావిడి కనిపించలేదు. ఈ సమయంలో కాపు నేతలు పవన్ ని కలవడం, పవన్ కళ్యాణ్ కాపుల శాసించే స్థాయికి ఎదగాలని వ్యాఖ్యలు చేయడం, అసలు పంచాయితీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగితే కనీసం కాపులైనా ఆదరిస్తారా అన్న చర్చకు కారణమవుతుంది.

పవన్ పై అభిమానం కానీ ఓటు బ్యాంకుగా మారని వైనం
ఇక కాపుల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు కాపు నాయకులు మద్దతు తెలుపుతారా? ఈ ఎన్నికల్లో ఓటు వేసి పవన్ కళ్యాణ్ కు పట్టం కడతారా అంటే అది కూడా ప్రశ్నార్థకమే.
జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ను అటు ప్రజలు, ఇటు విభిన్న వర్గాలు అభిమానిస్తున్నా ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కు ఆ అభిమానం ఓటు బ్యాంకుగా మారటం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ను కాపు నేతలు కలిసి అనేక సమస్యలపై మాట్లాడిన సందర్భంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది .

పంచాయతీ ఎన్నికల సమయంలో పవన్ ను కలిసిన కాపు నేతలు
మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు పంచాయతీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి కాపుల సమస్యలపై వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27 శాతం ఉన్న కాపులను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తున్నంత కాలం వారికి శాసించే శక్తి ఉండదని, యాచించే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే కాపులు శాసించే స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .
శాసించే స్థాయికి కాపులు ఎదగాలన్న పవన్ కళ్యాణ్ .. కానీ జనసేన కు మద్దతు ఉందా ? అన్న ప్రశ్న
జగన్ రెడ్డి , చంద్రబాబు సహా ఏ రాజకీయ నాయకుడైన సరే కాపుల డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమ నేతల వద్దకు రావాలి కానీ, కాపు నేతలు వారి వద్దకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సమస్యలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుండి రాజకీయ పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తామంటూ వచ్చిన జనసేన పార్టీకి కాపుల నుండి కూడా సరైన మద్దతు లభించినట్లుగా కనిపించలేదు.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఎక్కడ ? పవన్ కళ్యాణ్ పార్టీ పై ఏపీలో చర్చ
గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీని కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేయడం అందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై బీజేపీతో కలిసి దృష్టిసారించిన జనసేన, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందా.. కనీసం కాపులైనా జనసేన పార్టీ నుండి అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగితే వారిని ఆదరిస్తారా అనేది ఏపీ లో జరుగుతున్న ప్రధాన చర్చ. ఈ ఎన్నికల్లో పట్టు సాధించటం కోసం ఎందుకు పవన్ దృష్టి పెట్టటం లేదు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications