మీ రాజకీయ చదరంగంలో నేను చిన్నపావును కావొచ్చు కానీ: నేడు కర్నూలులో పవన్ పర్యటన
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం (24-02-2019) నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సి క్యాంపులో రోడ్డు షో నిర్వహిస్తారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం జగన్నాథగట్టు సమీపంలోని రాగమయూరి రిసార్టులో పార్టీ నేతలు, కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 25వ తేదీ ఉదయం మైనార్డీ ప్రతినిధులతో భేటీ అవుతారు.

ప్రత్యామ్నాయం లేక మూస రాజకీయాలకు అలవాటు పడిపోయిన సీమ ప్రజలకు మూడవ ప్రత్యామ్నాయంగా, వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయంగా, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో నేడు కర్నూలు నగరంలో జనసేనాని అడుగు పెడుతున్నారని జనసేన చెబుతోంది.
కర్నూలు పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన కొటేషన్ను జనసేన ట్వీట్ చేసింది. మీ రాజకీయ చదరంగంలో నేనొక చిన్నపావునే కావొచ్చు కానీ పోరాటానికి సిద్ధంగా ఉన్న సైనికుడిని అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, జనసేన పార్టీ ప్రచార రథంపై కొందరు దుండగులు దాడి చేయడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనసేన పార్టీని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కోలేక దాడులకు పాల్పడటం ఇతర పార్టీల ఓటమి భయానికి నిదర్శనమని, దాడి చేసినవారు ఎవరైనా సరే వారిపై పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని జనసేన డిమాండ్ చేసింది.
కాగా, గుంటూరు జిల్లా కేంద్రంలోని ఏటి అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఇది కలకలం రేపింది. ఏటి అగ్రహారంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అయితే, వైసీపీ కార్యకర్తలే రాళ్ల దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications