దళారులను మించి.. తినే తిండికీ పార్టీల రంగులు : రైతులకు అండగా జగన్ సర్కార్ కు పవన్ కళ్యాణ్ అల్టిమేటం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సర్కార్ తీరును ఎండగట్టారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్న దళారుల గురించి విన్నామని, ఇప్పుడు దళారులను మించిపోయి రైతులను రోడ్డు మీదికి తెచ్చిన ప్రభుత్వాన్ని చూస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి నిరుద్యోగులను ఎలా మోసం చేశారో అదేవిధంగా రైతన్నలను కూడా మోసం చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరి పంట పండించిన రైతులకు మూడు వేల కోట్లకు పైగా బకాయి ఉన్న సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం వరి పంట పండించిన రైతులకు మూడు వేల కోట్లకు పైగా బకాయి పడిందని, ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రబీ సీజన్ లో పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిన నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారికి డబ్బులు చెల్లించలేదని, రైతన్నలతో రాష్ట్ర ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో విఫలమవుతూనే ఉందని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.
కష్ట్రార్జితం అడిగిన రైతులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తారా ?
రబీ సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలలోనే 1800 కోట్ల రూపాయల వరకు రైతులకు బకాయిలు ఉన్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను లెక్కలను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారో , ప్రభుత్వం ఈ విషయంలో గోప్యత ఎందుకు పాటిస్తుందో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇక తమ కష్టార్జితం అడిగిన రైతులను అధికార పార్టీ నేతలు బెదిరించడం దుర్మార్గమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించని పక్షంలో రైతులకు అండగా జనసేన పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు.
రైతులను కూడా పార్టీల వారీగా విడదీస్తున్న ఘనత మీదే
అంతకుముందు రైతుల కోసం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపడితే ప్రభుత్వం దిగొచ్చి రైతుల సొమ్ము జమ చేసిందని గుర్తు చేశారు. రబీ సీజన్ డబ్బులు ఇవ్వకపోతే రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి ఎలా ఉంటాయని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, రైతులను కూడా పార్టీల వారీగా విడదీస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. పండించే పంటకి, తినే తిండికి, పార్టీ రంగులు పులమటం దిగజారుడుతనం అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.
Recommended Video
నెలాఖరులోగా బకాయిలు చెల్లించకుంటే రైతుల పక్షాన జనసేన పోరాటం
నకిలీ విత్తనాలు పురుగు మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పంట నష్టపరిహారం కూడా సక్రమంగా చెల్లించని పరిస్థితుల్లో, డబ్బులు రాక, రుణాలు అందక, వ్యవసాయం చేయలేక కోనసీమ గ్రామాల రైతులు పంట పండించలేమని క్రాప్ హాలిడే ప్రకటించారని, ఇందుకు ప్రభుత్వ వైఖరి కారణమని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రైతుల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించకుంటే రైతుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.