న్యూ ఇయర్ విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్: కొందరు పాలకుల వల్లే బాధలంటూ జనసేనాని చురకలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2002 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగు వారందరికీ, భారతీయులందరికీ జనసేన తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ 2022 సంవత్సరం పట్ల ఆశావహ దృక్పధాన్ని వ్యక్తం చేశారు.
2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ పవన్ విషెస్
నూతనం.. ప్రారంభం.. ఆరంభం, కొత్త అనే పదాలలోనే ఉత్తేజం నిబిడీకృతమై ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటువంటిది మరి కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలి వస్తుంది అంటూ నూతన సంవత్సర ఆగమనాన్ని గురించి ఆశాభావం వ్యక్తం చేశారు.
మన ముందు ఆవిష్కృతం అవుతున్న 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరి తోపాటు భారతీయులందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా పలాయనం చిత్తగించే దిశగా సాగిన ప్రయాణం
గడిచిన రెండేళ్లలో కరోనా మహమ్మారి మానవాళిపై ఆధిపత్యం సాధించాలని చేసిన ప్రయత్నాలను మనమందరం అనుభవైక్యంగా చవి చూశామని, అయితే మానవాళి మనోనిబ్బరం, మనోవిజ్ఞానం ముందు కరోనా పలాయనం దిశగా ప్రయాణించడం లోకకళ్యాణంగా భావిస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కరోన వెళ్ళిపోయే ముందు కూడా తన ప్రభావాన్ని చూపించటానికి ప్రయత్నిస్తూనే ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు పాటించిన జాగరూకతతోనే మనం ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కరోనాతో పాటు అతివృష్టి రూపంలో కూడా ప్రకృతి ప్రకోపం
గత ఏడాది ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించారో ఇకపైన కూడా అలాగే ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కరోనాతో పాటు అతివృష్టి రూపంలో కూడా ప్రకృతి కొంత కోపాన్ని ప్రదర్శించినా, ప్రజల జీవన ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోవటం సంతోషకరమైన పరిణామమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కొందరు పాలకుల చిత్త చాపల్యం వల్ల కూడా ప్రజల బాధలు
అంతేకాదు ఈ ప్రకృతి వైపరీత్యాలతో పాటు కొందరు పాలకుల చిత్త చాపల్యం వల్ల కూడా కొన్ని ప్రాంతాలలో ప్రజలు బాధలు పడ్డారని..పడుతూనే ఉన్నారు అని ఏపీ ప్రభుత్వ తీరుపై, జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఈ నూతన సంవత్సరంలో తెలుగురాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలని, ఎటువంటి ఈతి బాధలు లేకుండా ప్రజలకు సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలన్నదే తన ఆకాంక్షగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని పవన్ కళ్యాణ్ హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా వెల్లడించారు.