వైసీపీ చిచ్చుపెట్టి రెచ్చగొట్టింది : నాడు తునిలో కూడా - దాడుల పని వాళ్లదే : పవన్..!!
అమలాపురం లో జరిగిన విధ్వంసం వెనుక వైసీపీ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ సమయంలోనే ఈ గొడవ ఎందుకు వచ్చిందనే దానికి కారణం ఉందన్నారు. ఎమ్మెల్సీ హత్య అంశం కవర్ చేసుకోవటానికే ఈ ఘటన జరిగిందన్నారు. మంత్రి - ఎమ్మెల్యే ఇంటిపై దాడి తమ వాళ్లతోనే చేయించుకున్నారంటూ ఆరోపించారు. తీవ్రంగా దాడులు జరుగుతుంటే..మంత్రుల ఇళ్ల మీద దాడులు చేస్తుంటే పోలీసులను ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. ఇతర జిల్లాలతో పాటుగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ చెప్పుకొచ్చారు.

ఆ జిల్లాలు ఒకలా..కోనసీమకు ఎందుకిలా
దీనిని జాప్యం చేసి..ఇప్పుడు ప్రకటించటం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీసారు. ఇతర జిల్లాలకు ఒక విధానం.. కోనసీమకు ఒక విధానమా అని ప్రశ్నించారు. మిగిలిన జిల్లాలతో పాటుగానే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గతంలో తునిలో రైలు దహనం చేసి మరొకరి మీదకు తోసేసారని పవన్ ఆరోపించారు. కులాల పేరుతో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఎవరూ భావోద్వేగాలకు లోనుకావద్దని పవన్ కోరారు. క్రిష్ణా నది ఎక్కువగా ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి.. సముద్రం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి క్రిష్ణా జిల్లాగా పేరు ఖరారు చేసారని చెప్పుకొచ్చారు.

30 రోజుల సమయం కుట్రపూరితమే
ఈ నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలుంటే 30 రోజుల సమయం అడిగారని..గతంలో ఏ జిల్లాకు లేని విధానం ఇక్కడ ఎందుకు అమలు చేసారని ప్రశ్నించారు. ఇక్కడ గొడవలు జరగాలనేదే వైసీపీ ప్రభుత్వం ఉద్దేశమని వ్యాఖ్యానించారు. కోనసీమలో శాంతి యుతంగా పరస్పర సహకారంతో జీవిస్తున్న వారి మధ్య చిచ్చు పెట్టి..విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కలెక్టరేట్ కు వచ్చి వ్యక్తగతంగా అభ్యంతరాలు ఇవ్వాలని చెప్పటం వెనుక ఉద్దేశం చెప్పాలని డిమాండ్ చేసారు. దాడులను అడ్డుకొనే అవకాశం ఉన్నా అడ్డుకోలేదని చెప్పారు. పోలీసులు అలర్ట్ కాకుండా ఉండటం అనుమానాలకు కారణమవుతోందన్నారు.

దాడులు అడ్డుకొనే అవకాశం ఉన్నా..
మంత్రి ఇంటి మీదకు దాడికి వస్తే రక్షణ కల్పంచకుండా..తీసుకెళ్లిపోయారు..పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. జరగాల్సిన ఘోరం జరిగేలా చేసి..ఈ గొడవలకు తానే కారణమని మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. 25 జిల్లాలు ఉన్నాయని... ఒక్క కోనసీమకే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టాల్సి ఉందని పవన్ ప్రశ్నించారు. కడప జిల్లాకు లేదా కొత్తగా వచ్చిన ఆ ప్రాంత జిల్లాలకు పెట్టుకోవాల్సి ఉండవచ్చని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని... దాడులు జరిగాయంటూ పవన్ లెక్కలు చెప్పుకొచ్చారు. కోనసీమ వాసులు అందరూ కలిసి ఇంకా సమయం ఉందని..ఈ లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేకుంటే రిఫరెండం కోరాలని పవన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications