ఆ ఉత్తర్వులతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చుపెడతారా?: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అమరావతి: వివాదాలకు తావులేని భూములను మాత్రమే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని అన్నారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Recommended Video


ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..
రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలన్నారు .

ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే..
‘ఓ వైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారు' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

వివాదాస్పద భూములను పేదలు ఇస్తారా?
‘రాజధాని గ్రామాలలోనే కాకుండా జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు నెలకొని ఉన్నాయి. అసైన్డ్ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని వెల్లడిస్తోంది' అని పవన్ కళ్యాణ్.. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులే..
మరో ప్రకటనలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై అనుచిత విమర్శలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆ పార్టీ హెచ్చరించింది. గతంలో పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకొంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో పార్టీని, పార్టీ విధానాలను, ముఖ్య నాయకులను, కార్యనిర్వాహకులను కించపరుస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న విషయం పార్టీ దృష్టికి చేరింది. పార్టీ సిద్ధాంతాలపై గౌరవంగానీ, అధ్యక్షుల వారిపై అభిమానంగానీ లేనివారే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారు. దురుద్దేశపూర్వకంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదని పార్టీ లీగల్ సెల్ నిర్ణయించింది. రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియోలు పెడుతూ, ఫేస్ బుక్, వాట్సప్ల్లో పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్న విషయం లీగల్ సెల్ గుర్తించింది. ఈ విధమైన తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను చేపడతాం. ముందుగా లీగల్ నోటీసులు జారీ చేసి, తదుపరి క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించామని జనసేన పార్టీ న్యాయ విభాగం కో ఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ తెలిపారు.












Click it and Unblock the Notifications