సీమ ఫ్యాక్షన్ కాదు.. లీడర్ల భూములే కళకళ.. అక్కడ అలాంటి ఫ్యాక్టరీనా? వైఎస్ జగన్పై పవన్ నిప్పులు!
రాయలసీమ అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బదులు న్యూక్లియర్ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. పరిశ్రమలను స్థాపించే ముందు ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా ఆదివారం రైల్వే కోడూరులో మాట్లాడుతూ...

స్టీల్ ప్లాంట్ కోరితే అలాంటి ఫ్యాక్టరీనా?
రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ స్టీల్ ప్లాంట్ను పక్కన పెట్టి న్యూక్లియర్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. తుమ్మలపల్లి యురేనియం ఫ్యాక్టరీ కారణంగా ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఆరు గ్రామాలను ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాంటి ఫ్యాక్టరీనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నది. దీనివల్ల ఆయన మనషులకు ఎలాంటి కాంట్రాక్టులు దక్కుతాయో అని పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాన్ని వదిలారు.

ప్రజా సంక్షేమంపై పట్టింపు లేదా?
న్యూక్లియర్ రిఫైనరీ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం చూస్తే ఈ సర్కారుకు ప్రజల సంక్షేమంపై పెద్దగా పట్టింపులేదనే విషయం స్పష్టమవుతున్నది. త్వరలోనే యురేనియం బాధితులను కలుస్తాను. అందుకోసం తుమ్మలపల్లిలో పర్యటించి అక్కడి బాధితుల సమస్యలను తెలుసుకొంటాను. ప్రజారోగ్యంపై చెడు ప్రభావం పడే పరిశ్రమలను స్థాపించకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

నేతల భూములే కళకళ
రాయలసీమలోని దుర్బిక్షంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశాడు. దేశ మొత్తంగా చూసుకొంటే రాయలసీమలో వర్షాపాతం తక్కువ. కానీ ఇక్కడ నేతల భూములు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. అదే సగటు రైతు భూములు మాత్రం బీడుపోయి ఉండటం నన్ను ఎంతగానో కలిచివేస్తుంది. నేను ఎప్పుడు రాయలసీమలో పర్యటించినా ఇక్కడి యువత నాకు ఇదే విషయాన్ని చెప్పి బాధపడుతుంటుంది.

రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు..
రాయలసీమ అంటే ఫ్యాక్షన్తో నిండిన నేల కాదు. ఈ భూమి చదువుల సీమ. రాయలసీమలో భారీ లైబ్రరీని నిర్మిస్తాం. అందుకోసం స్థల సేకరణ చేపడతాం. ఇక్కడి యువతలో ఫ్యాక్షన్ను కాకుండా నాలెడ్జిని అందించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నాం. చదువు, విజ్హానం అనే కత్తితో ఇక్కడ ప్రజల్లో ఉన్న భయాన్ని పారిపోయేలా చేస్తాం. ఇక్కడి ప్రజల్లో ఉన్న పిరికితనాన్ని పారదోలడమే నా లక్ష్యం. అందుకే ఇక్కడి వచ్చాను. రాయలసీమ జగన్ రెడ్డి సొంత ఆస్తి కాదు అని పవన్ కల్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications