మీరు పనిచేస్తే నా అవసరం ఎక్కడిది, బాబు వేలెత్తి చూపడం నచ్చలేదు, బాధేసింది: పవన్
ఏలూరు: నాయీ బ్రాహ్మణులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేలెత్తి చూపడం తనకు నచ్చలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, బ్రాహ్మణ సంఘాలు, ఆటో యూనియన్ల సమావేశంలో జనసేనాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు.
Recommended Video
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను వేలెత్తి చూపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణులు ఏమైనా ఉగ్రవాదులా, డైనమేట్లు పేల్చే క్వారీ వ్యాపారమా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సరిగ్గా పని చేస్తే జనసేన అవసరం ఉండేది కాదన్నారు. ఆయన మాట నిలుపుకునే వ్యక్తి కాదన్నారు. నిర్లక్ష్యానికి గురైన కులాలకు ఇవ్వాల్సింది ఆత్మగౌరవమని, అది జనసేన ఇస్తుందని చెప్పారు.
కులాల గుప్పిట్లో కాదు, చిరంజీవి ఓ ప్రయత్నం చేశారు: పవన్, దాసోజు శ్రవణ్ ప్రస్తావన
జనసేన గుండెకు హత్తుకుంటుంది
విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిని కొట్టిన ఎమ్మెల్యేలను చంద్రబాబు ఏమీ అనరని, అడ్డగోలుగా ఇసుకను దోచుకున్న వారిని ఏమీ చేయరని, కానీ స్వయంశక్తితో, వృత్తి నైపుణ్యంతో బతుకుతున్న నాయీ బ్రాహ్మణులు అడిగితే మాత్రం బెదిరిస్తారన్నారు. జనసేన అందరినీ గుండెలకు హత్తుకుంటుంది తప్ప బెదిరించదన్నారు. జీతాలు పెంచితే నాయీ బ్రాహ్మణులు బలపడిపోతారని చంద్రబాబు భావిస్తున్నారని మండిపడ్డారు.
జనసేన అవసరం ఉండేది కాదు
చంద్రబాబు అన్ని కులాలకు న్యాయం చేస్తున్నానని చెబుతారని, మరి అలా చేస్తే నాయీ బ్రాహ్మణులు తన వద్దకు ఎందుకు వచ్చేవారని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే జనసేన అవసరం ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో ఇద్దరు నాయకులు ఉన్నారని, ఒకరేమో ముఖ్యమంత్రిని చేస్తే సమస్యలు తీరుస్తానని చెబుతారని, మరొకరేమో ఇంకోసారి సీఎంను చేస్తే అద్భుతాలు సృష్టిస్తానని అంటారని జగన్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు.
నాకు అది బాధ కలుగుతోంది
చంద్రబాబుకు మాట ఇవ్వడానికి మనసు ఉంటుంది కానీ నిలబెట్టుకోవడానికి ఉండదని పవన్ విమర్శించారు. మనుషులను మనుషులుగా కాకుండా కులాభిమానంతో చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తాను మాత్రం కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని, కాపుల రిజర్వేషన్ కోసం మాట్లాడితే బీసీలు దూరమైపోతారని, వ్యతిరేకంగా మాట్లాడితే కాపులు దూరమైపోతారని లెక్కలు వేసుకుని సమాజాన్ని చీల్చేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత రాజకీయ నాయకుల వల్ల కులాలే కాకుండా కుటుంబాలే విడిపోతున్నాయన్నారు. జనాభాలో సగం మంది ఉన్న బీసీలు దశాబ్దాలుగా మోసపోవడానికి కారణం ఐక్యత లేకపోవడమే అన్నారు.
పూర్వీకుల తప్పుకు ఈ తరంవారు ఇబ్బందిపడొద్దు
నాయీ బ్రాహ్మణులు తమ డిమాండ్లను చెబితే ముఖ్యమంత్రి చేయి చూపించి బెదిరించారని పవన్ ఆరోపించారు. నేను చంద్రబాబు, జగన్లా మాటలు మార్చనని, అన్ని కులాలకు అండగా ఉంటానని, మీ సమస్యలపై జనసేన పోరాడుతుందని తెలిపారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతోంది బ్రాహ్మణ సమాజమన్నారు. ఏ సమాజంలో అయినా పూర్వీకులు చేసిన తప్పులకు ఈ తరంవారు ఇబ్బంది పడకూడదని చెప్పారు.
14న జనసేన విజన్ డాక్యుమెంట్
జనసేన విజన్ డాక్యుమెంట్ను ఈ నెల 14న విడుదల చేయనుంది. పార్టీ మేనిఫెస్టో ఎన్నికలకు ముందు రానుంది. వివిధ అంశాల్లో పార్టీ ఆలోచన, దృక్పథం ఈ దార్శనిక పత్రంలో ప్రతిబింబించనుంది. ఈ అంశాలపై ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు ఆహ్వానించనుంది. ముసాయిదా విజన్ డాక్యుమెంటు డ్రాఫ్టును పవన్ పరిశీలనకు పంపించారని తెలుస్తోంది. దీనిలో పవన్ ఏమైనా మార్పులు, సవరణలు చేస్తే... వాటిని సరి చేస్తారు. జనసేన పార్టీ ముఖ్యులు, వివిధ అంశాలపై నిపుణులను కలిసి దీనిని తయారు చేశారు.