పవన్ రాక గోప్యం, విశాఖలో బస: బస్సు యాత్ర కోసం ఏర్పాట్లు
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ నగరానికి వచ్చారు. బుధవారం రాత్రి 9.10 గంటలకు రామాటాకీస్ దరి అంబేడ్కర్ భవన్కు చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేశారు.
ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి బస్సుయాత్ర నిర్వహించడానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై ముందే ఎలాంటి ప్రకటన చేయలేదు.
బస్సు యాత్ర ఎప్పుడు?
కాగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి బస్సుయాత్ర చేయనున్నట్లు గతంలో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. గురువారం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారా లేదా శుక్రవారం నుంచా? అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.
పవన్ రాక గోప్యం..
కాగా, పవన్ కళ్యాణ్ రాకను గోప్యంగా ఉంచారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి చరవాణి ద్వారా రూమ్ బుక్ చేసుకున్నట్లు అంబేడ్కర్ భవన్ అధ్యక్షులు బొడ్డు కల్యాణరావు చెప్పారు. సాయంత్రం నాలుగు గంటల వరకు స్థానిక జనసేన నాయకులకు కూడా తమ నాయకుని రాక విషయం తెలియకపోవడం గమనార్హం. రాత్రి ఏడు గంటల వరకు అంబేడ్కర్ భవన్ వద్ద కొద్ది మంది ముఖ్య నాయకులు మినహా ఎవరూ లేరు. 8.30 గంటల తార్వాత జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకున్నారు.
అంబేద్కర్ భవన్లో..
కపవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి భారీగా అభిమానులు గుమిగూడారు. ఆయన వచ్చిన వెంటనే అంబేడ్కర్ భవన్లో అంబేడ్కర్, గౌతుమ బుద్దుని విగ్రహాలకు నమస్కరించారు.
నేతలతో సమావేశం
అనంతరం తాను బస చేసిన గదికి వెళ్లిపోయారు. మీడియాను అనుమతించలేదు. మీడియా సభ్యులంతా వెళ్లిపోయాక పది గంటల సమయంలో కిందకు వచ్చి మహిళలు, కొద్ది మంది కార్యకర్తలతో రెండు నిమిషాలు మాట్లాడి తన గదికి వెళ్లిపోయారు. గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సమావేశమై బస్సు యాత్రపై చర్చించనున్నారు. నిన్ననే మూడు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకున్న విషయం తెలిసిందే.