గ్రామ దత్తతపై రాంచరణ్ని అడుగుతా, శ్రీకాకుళం కోసం ముందుకు రావాలి: పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం: టిట్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలుగు ప్రజలంతా అండగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళంలో జిల్లాలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
చిచ్చుపెట్టడానికి రాలేదు: శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్, 'జనసేనలోకి చదలవాడ'
నష్టపోయిన చెట్లకు వందో... ఐదు వందలో ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందని పవన్ అన్నారు. నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే... తాము అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ చేస్తామని, అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
సీఎం ఇంట్లో కరెంటు పోతే..
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఇంకా చీకట్లోనే ఉందనే విషయం చాలామందికి తెలియదని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం ఇంట్లో ఒక్క రోజు కరెంట్ పోతే ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. తుఫాను బాధితులను ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశంతోనే తాను 4 రోజులు ఆలస్యంగా వచ్చానని పవన్ తెలిపారు.
నిలదీస్తే అరెస్టులా?
టీడీపీ కార్యకర్తలు మారుమూల గ్రామాల్లోకి వెళ్లడం లేదన్న జనసేన అధినేత... ప్రజాప్రతినిధులను నిలదీస్తే అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒక చెట్టు ఎదిగి పండు కాయం ఎంత సహజమో...జనసేన కష్టపడి అధికారంలోకి రావడం అంతే సహజమని పవన్ జోస్యం చెప్పారు.
తుఫాను బాధితులతో చర్చ
టిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... శ్రీకాకుళంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నిర్మాణం, తుఫాను బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
రాంచరణ్ని అడుగతా..
కాగా, పవన్ కళ్యాణ్ శ్రీకాళం జిల్లాలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుని ఆదుకోవాలని కోరారు. తాను రాంచరణ్(మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, ప్రముఖ నటుడు)ను శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అడుగుతానని పవన్ చెప్పారు. కాగా, దీనిపై రాంచరణ్ సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.