జగన్ 'మానస పుత్రిక'పై పవన్ కల్యాణ్ యుద్ధం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మానస పుత్రికగా భావిస్తున్న నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కీలకమైంది. జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. స్థలంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన నగదును కూడా ప్రభుత్వం అందజేస్తోంది.

అవినీతిని నిరూపిస్తామంటున్న జనసేన
జగనన్న ఇళ్ల కాలనీల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లను నిర్మించే చర్యలు ప్రారంభమయ్యాయి. ముందుగా లేఔట్లు వేశారు. కొన్నింటిలో మార్కింగ్ జరగలేదు. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంటనే దీనిపై యుద్ధం ప్రకటించారు. రాజకీయంగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. అవినీతికి ఆలవాలంగా ఈ పథకం మారిందని, అవినీతి రహిత పాలన కావాలంటే జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నరు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలోని గుంకలాంలో ప్రభుత్వం భారీసంఖ్యలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లను పరిశీలించారు.

జగనన్న ఇళ్లు - పేదల కన్నీళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ఈ కాలనీల పరిస్థితులు తెలుసుకునేందుకు, వాటి నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ''జగనన్న ఇళ్లు - పేదల కన్నీళ్లు" పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మూడురోజులుగా జనసేన నాయకులు పల్నాడు, బాపట్ల, కోనసీమ, గుంటూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణ పనులను పరిశీలించారు. జగ్గయ్యపేటలోని కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై, కోనసీమ జిల్లా కాట్రేనికోట మండలం, గుంటూరు జిల్లా పేరేచర్ల మండలంలో లబ్ధిదారులతో మాట్లాడారు. వాస్తవానికి మూడురోజులే అనుకున్నప్పటికీ మరో మూడురోజులు ఈ కార్యక్రమాన్ని పొడిగించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని పవన్ చెబుతున్నారు. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలను నడిపిస్తున్నారు.

ఇళ్ల పథకంపై నీలినీడలు?
పవన్ కల్యాణ్ దూకుడుతో రాష్ట్రంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్ల పథకాలపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న అవినీతిపై అవసరమైతే కోర్టుకు వెళతామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా కొనసాగుతాయా? లేదంటే ఆగిపోతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వీటిని ప్రధాన అస్త్రంగా చేసుకొని ఎన్నికలకు వెళ్లాలనే భావనలో ఉంది. అయితే జనసేన అనూహ్యంగా వీటిని అస్త్రంగా మార్చుకొని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.












Click it and Unblock the Notifications