ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, బలిదానం అవుతా: పవన్ కల్యాణ్ హెచ్చరిక
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఆ అవసరం వస్తుందని అనుకుంటున్నానని, తన ప్రాణాలను బలిదానం అవుతానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు.
తన ఆమరణ దీక్ష చేపట్టిన తర్వాత పరిణామాలు తన చేతుల్లో ఉండవని అన్నారు. అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన బుధవారం సాయంత్రం చాలా ఉద్వేగంగా మాట్లాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి ఇంకా ఉందని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉన్నామని, బాధ్యతతో ఉన్నామని అన్నారు.
నేను ఇక్కడే ఉంటా...
ఈ నెల 18వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని, ఉగాది పండుగ ఇక్కడే జరుపుకుంటానని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటానికి కలిసి వచ్చే పార్టీలతో పార్టీ కార్యాలయంలో చర్చలు జరుపుతానని అన్నారు. సిపిఐ, సిపిఎంలతో చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
నేను అలా అడగనని..
తాను మీ బలిదానాలు కోరబోనని పవన్ కల్యాణ్ పార్టీ అభిమానులను, యువతను ఉద్దేశించి అన్నారు. మీరు చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, రాజకీయ పోరాటం తాను చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. అవసరమైతే పవన్ కల్యాణ్ బలిదానం చేస్తాడని అన్నారు. తెలుగువాడి తెగింపు, ఆత్మగౌరవం ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి చూపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
మేం పౌరుషం, ఆత్మగౌరవం ఉన్నవాళ్లం..
ఒక్క రోజు ఇస్తామని చెప్పి మరో రోజు ఇవ్వబోమని అంటే ఊరుకోబోమని, తాము పౌరుషం, ఆత్మగౌరవం ఉన్నవాళ్లమని పవన్ కల్యాణ్ అన్నారు. పోరాటం చేసి విశాఖ రైల్వే జోన్ సాధిద్దామని అన్నారు. ప్రత్యేక హోదాపై చేతులు దులుపుకుని కూర్చుంటే ఊరుకునేవాళ్లం కాదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. పార్లమెంటులో డ్రామాలు ఆడి చేతులు దులిపేసుకుంటే చెవిలో పూవులు పెట్టుకుని లేమని అన్నారు.
ప్రత్యేక హోదా ఒక్కటే కాదు...
సమస్య ప్రత్యేక హోదా ఒక్కటే కాదని, అదో విధానమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడుహామీ ఇచ్చాం గానీ ఇప్పుడు ఇవ్వలేమనిేది విధానంగా మారుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన సంప్రదాయంగా మారుతుందని ఆయన అన్నారు. దానిపై బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
వారంతా స్పష్టత ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారు. తాము ప్రజా ఉద్యమాలు చేస్తామని, రోడ్డెక్కుతామని చెప్పారు. ఏ తల్లి జన్మనిచ్చిందో, ఏ భూమి అశ్రయం కల్పించిందో ఆ తల్లికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు.
నాకు ఉడుకు రక్తం కావాలి...
తెలంగాణలో తనకు ఉడుకు రక్తం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త నాయకత్వం తనకు కావాలని ఆయన అన్నారు. జనసేన పార్టీ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండని కోరారు. ఆ మిస్డ్ కాల్ నెంబర్ కూడా ఆయన చెప్పారు. భారత్ మాతాకై జై అంటూ ప్రసంగాన్ని ముగించారు. తన ప్రసంగంలో ఆయన ప్రముఖ కవి శివారెడ్డి మాటలను ఉటంకించారు.