రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్: రైతులకు ఆర్థిక చేయూత
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు.
కౌలు రైతుల భరోసా యాత్ర కార్యక్రమం కోసం మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం చేస్తారు. ఉదయం 10:30 గంటలకు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందిస్తారు. ఉదయం 11:20 నిమిషాలకు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్ధిక సాయం చేస్తారు.
ఆ తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం గం. 12: 10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే గ్రామసభ(రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. గ్రామ సభ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు పవన్ కళ్యాణ్.
ఇది ఇలావుండగా, ఏపీలో కౌలు రైతులను వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై మూడేళ్ల క్రితం చట్టం చేసిన ప్రభుత్వం.. అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలని.. కానీ, ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే కౌలు రైతులను ఆదుకునేందుకు జనసేన ముందుకొచ్చిందన్నారు. జనసేన తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర.. జగన్ సర్కారుకు కనువిప్పు కలిగించాలన్నారు.