'మోడీ ఏం మాయ చేశారో, ముఖ్యమంత్రి పీఠంపై పవన్ కళ్యాణ్ దృష్టి'
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఎందుకు స్పందించడం లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాయ చేశారో పవన్, జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక రాయితీలు, పన్ను ప్రోత్సాహకాల గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై ఎందుకు మాట్లాడరన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దుష్ఫలితాలు వీరిద్దరికీ కనపడడం లేదా అని నిలదీశారు.

పవన్ కళ్యాణ్, జగన్ల దృష్టి అంతా ముఖ్యమంత్రి పీఠం పైనే ఉందని యనమల ఆరోపించారు. గతంలో రైతు రుణమాఫీ విషయంలో, ఇప్పుడు కాపు రిజర్వేషన్ విషయంలో వైయస్ జగన్కు మాటపై నిలకడ లేదన్నారు. జగన్కు ఏ విషయం పైనా అవగాహన లేదన్నారు.
బీజేపీ పార్లమెంటరీ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం లేకుండా, అజ్ఞానంతో అవిశ్వాసం పెట్టారన్న ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డారు. అలా అనడం బీజేపీ అహంకారానికి నిదర్శనం అన్నారు.
అపరిపక్వత, అపరిణతి, అవగాహన లేమి ఆ పార్టీ అధినాయకత్వానిదన్నారు. ప్రజల్లో బీజేపీ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకత అవిశ్వాసం తీర్మాన సమయంలో ప్రతిబింబించిందన్నారు. ప్రజావ్యతిరేకత తీవ్రతకు భయపడే ప్రధాని మోడీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, ప్రధాని మోడీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications