పవన్ కల్యాణ్తో వామపక్షాలు సై: ఎన్నారైలతోనూ ఆయన భేటీ
అమరావతి: తాను ఎన్నారైలను పార్టకి నిధుల బ్యాంక్గా చూడబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఎన్నారైలతో సమావేశమయ్యారు. పార్టీ నెట్ వర్కింగ్కు సాయపడాలని ఆయన ఎన్నారైలను కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైల సహకారం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోనూ సిపిఐ కార్యదర్శి రామకృష్ణతోనూ ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై కలిసి పనిచేద్దామని పవన్ కల్యాణ్ కోరారని మధు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్తో కలిసి పనిచేయడానికి వామపక్షాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
కలిసి పోరాడాలని పవన్ కల్యాణ్
వెనకబడిన జిల్లాల కోసం పని చేయాలని పవన్ కల్యాణ్ కోరినట్లు ఆయన తెలిపారు. దాన్ని తాము స్వాగతించామని చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలపై కలిసి పోరాడాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలిపారు. దానికోసం ఈ నెల 19వ తేదన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మధు చెప్పారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
చంద్రబాబు పోరు సరిగా లేదు..
ప్రత్యేక హోదా, విభజన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన పోరాటం చేయడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా..
అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎపికి ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇస్తున్నాయని, అయినా చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదని రామకృష్ణ అన్నారు. చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో అర్థం కావడం లేదని అన్నారు.
మోడీకి బాబు భయపడుతున్నారు
ఎన్డీఎలో ఉంటూ చంద్రబాబు ప్రధాని మోడీకి భయపడుతున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చన తర్వాత బిజెపి ఒంటెత్తు పోకడలు పోతోందని విమర్శించారు. సిబిఐ, ఐటి అధికారలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని అన్నారు ఐ విషయాలన్నీ పవన్ కల్యాణ్తో చర్చించినట్లు తెలిపారు.
వారికి పవన్ కల్యాణ్ మద్దతు
జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జరిగే ఆందోళనకు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించినట్లు, తాము మద్దతు ఇస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రాజకీయాలు రావాలని కోరుకుంటున్నామని చెప్పరు.
అసెంబ్లీలో ధనవంతుల తిష్ట
అసెంబ్లీలో సంపన్నులు తిష్ట వేశారని రామకృష్ణ విమర్శించారు. వారికి సామాన్యుల కష్టాలు ఏం తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. సిపిఐ, సిపిఎం వేర్వేరు పార్టీలయినా కలిసి ఉద్యమాలు చేస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.