23కు బదులు 13 జిల్లాలు: బాధపడ్డ బాబు, 30 ఏళ్లు
విజయవాడ: అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ఏపీఎన్జీవో సన్మాన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మాట ఆయన నోట వినిపించింది! 23 జిల్లాలు అని సంబోధించడానికి బదులు 13 జిల్లాలు అని అనడం ఎంతో బాధాకరంగా ఉందని చంద్రబాబు అన్నారు.
ఇటీవల రఘువీరా మాట్లాడుతూ.. గతంలో 23 జిల్లాలను పాలించిన చంద్రబాబు ఇప్పుడు 13 జిల్లాలను పాలించాల్సి వచ్చిందనే ఫీలింగులో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు శనివారం 23 జిల్లాలకు బదులు 13 జిల్లాలు అనడం బాధాకరంగా ఉందన్నారు. అయితే, 23 జిల్లాలను పాలించినప్పుడు బిజీగా ఉన్నప్పటికీ 13 జిల్లాలు అయినందున మరింత దృష్టి పెట్టేందుకు సమయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోని కేసులు ఎత్తివేస్తామని, ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్ని సెలవుగా చేస్తామన్నారు.

పార్టీ నేతలతో...
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు ఒక పాఠం వంటిదని, ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. విజయవాడలో శనివారం కృష్ణా జిల్లా టీడీపీ కుటుంబసభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. రెండు సమావేశాల్లోనూ ఆయన మాట్లాడారు.
రాష్ట్ర నిర్మాణానికి ప్రభుత్వంతోపాటు పార్టీ నాయకత్వం కూడా సమాంతరంగా కృషి చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. 122 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్రస్ లేకుండా ఓడించారని, సమైక్య వాదమని నటించి డబ్బులతో గెలుపొందాలనుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా ప్రజలు ఓడించారని, ఎన్నికల తీర్పును పాఠంగా తీసుకుని సరిగా పని చేస్తే 30 ఏళ్లపాటు నిరవధికంగా అధికారం మనదే అన్నారు.












Click it and Unblock the Notifications