విద్యుత్ సంక్షోభానికి కారణం సీఎం జగన్, మీ నిర్వాకానికి మోడీని బాధ్యుడ్ని చెయ్యొద్దు: పయ్యావుల కేశవ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పయ్యావుల కేశవ్ విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగులులో ఉంటే, తెలంగాణ లోటులో ఉందని కానీ ప్రస్తుతం తెలంగాణ మిగులులో ఉంటే ఏపీ లోటులో ఉంటుందని, సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వ అనుచిత నిర్ణయాలు, విధానమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంక్షోభానికి కారణమని పయ్యావుల కేశవ్ విమర్శించారు.
ఆర్థిక రంగాన్ని కుదేలు చేసినట్టే, విద్యుత్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రంగాన్ని కుదేలు చేసినట్టే, విద్యుత్ రంగాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కుదేలు చేశారని పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, సీఎం నోటివెంట అర్థసత్యాలు, అవాస్తవాలను పలికిస్తుంది అధికారులేనంటూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పయ్యావుల కేశవ్. వర్షాకాలంలో రిజర్వాయర్లు నిండిన సమయంలో కూడా విద్యుత్ కోతలా? అంటూ నిప్పులు చెరిగారు. అధికారులు ప్రధానికి సీఎం జగన్ చేత లేఖ రాయించటం దేనికని ప్రశ్నించారు.
రాష్ట్రం సమస్యను చైనాతో పోల్చడం ఎందుకు?
విద్యుత్ సంక్షోభంపై ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ చైనా, యూరప్ తో ఏపీని పోల్చారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్ కి ఎందుకు అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో లేని సమస్య ఏపీకి రావటం ఎలా అంటూ నిలదీశారు. రాష్ట్రం సమస్యను ఇతర దేశాలతో పోల్చడం ఎందుకు నిలదీసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ రాష్ట్రప్రభుత్వం చేసిన నిర్వాకానికి ప్రధానిని బాధ్యుడిని చెయ్యొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసింది వైసీపీ కాదా ?
ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని, ప్రజలపై 50 వేల కోట్ల అదనపు భారం ఎందుకు మోపుతున్నారో చెప్పాలని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సింగరేణి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసింది వైసిపి కాదా అంటూ నిలదీశారు. ఆర్టీపీపీ, వీటీపీఎస్ ప్లాంట్స్ ను మూత వేయించి ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ ధ్వజ మెత్తారు. అంతేకాదు కృష్ణపట్నం, హిందూజా మూత పడేలా చేసింది వైసిపి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
ఏపీలో విద్యుత్ సంస్థలు దివాలా తీయటం వెనుక వైసీపీ కక్ష సాధింపులు
అధిక ధరకు పవన విద్యుత్ కొనుగోలు చేయలేని వైసిపి సర్కార్, అదానీ నుంచి మాత్రం అధిక ధరకు సోలార్ విద్యుత్ ను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఏపీలో విద్యుత్ సంస్థలు దివాలా తీయడం వెనుక వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులు ఉన్నాయని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.
విద్యుత్ సమస్యపై ప్రధాని మోడీకి లేఖ రాసిన జగన్
విద్యుత్ ధరలు, అదనపు ఇంధనం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదముందని పేర్కొన్నారు జగన్. ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందని ప్రధానికి రాసిన లేఖలో వెల్లడించారు. సెప్టెంబర్ నెలలోనే విద్యుత్ డిమాండ్ 20 శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు. బొగ్గు కొరత వల్ల ఏపీలో ధర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతో పని చేస్తున్నాయని ఏపీ విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి మోడీ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.