శ్రీరామ్ పెళ్లి: కేసీఆర్ వస్తారనే చంద్రబాబు అలా ప్లాన్! '25 ఏళ్లుగా మాటపడలేదు'
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిన టిడిపి సీనియర్ పయ్యావల కేశవ్ ఆయనను కలవనున్నారని తెలుస్తోంది.
అమరావతి: పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిన టిడిపి సీనియర్ పయ్యావల కేశవ్ ఆయనను కలవనున్నారని తెలుస్తోంది.
ఏకాంత భేటీల అవసరమేంటి?; తప్పేముందన్న కేశవ్, కేసీఆర్ అనంత ఎపిసోడ్ చిచ్చు
Recommended Video
ఇటీవల మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పయ్యావుల కలిశారు. ఇది బాబు కోపానికి కారణమైంది.
చంద్రబాబు అసహనం
మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ సందర్భంగా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. కేసీఆర్ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు పార్టీ నాయకులు కొందరు అతిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్తో పయ్యావుల కేశవ్ ఏకాంతంగా సమావేశమవడం వంటివి తప్పుడు సంకేతాలిచ్చాయని, దాని వల్ల తెలంగాణలో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు.
టి-టిడిపి నేతల బెదిరింపు, కేసీఆర్ వస్తాడని బాబు ప్లాన్
తెలంగాణ నాయకులు రాజీనామాలు చేస్తామని, తమ దారి తాము చూసుకుంటామని అంటున్నారని చంద్రబాబు వాపోయారు. కేసీఆర్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అని, ఆయన వచ్చినప్పుడు మర్యాదగా ఆహ్వానించడం, వీడ్కోలు ఇవ్వడం మన బాధ్యత అన్నారు. మనం అంతవరకే ఉండాలని నేతలతో అన్నారు. తాను కూడా ఆయన వచ్చే సమయానికి, పలకరించి వెళ్లిపోయేలా ప్రణాళిక వేసుకున్నానని చెప్పారు.
హంగామా చేశారు
పార్టీ నాయకులు కొందరు ఆయన చుట్టూ చక్కర్లు కొట్టారని, అంత అవసరం ఏమొచ్చిందని, కేసీఆర్తో పయ్యావుల ఏకాంతంగా సమావేశమయ్యారంటూ టీవీ ఛానళ్లలో హంగామా చేశారని, సీనియర్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనే ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో టిడిపి ఉందని, ఇలాంటి చర్యల వల్ల పార్టీకి ఇబ్బంది ఏర్పడుతుందని మర్చిపోతే ఎలాగని మండిపడ్డారు.
25 ఏళ్లుగా మాట అనిపించుకోలేదు
వ్యక్తిగత పనుల్లో ఉండటంతో పయ్యావుల సమన్వయ కమిటీ భేటీకి హాజరు కాలేదు. అధినేత తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసి ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన బాబును కలవనున్నారని తెలుస్తోంది. ఆ రోజు కేసిఆర్ ఎదురుపడినప్పుడు నేను నమస్కారం చేసి ముందుకు వెళ్లిపోయానని, కానీ డీఐజీ ద్వారా తనను కేసీఆర్ హెలిప్యాడ్ వద్దకు పిలిపించుకున్నారని, అందులో తన తప్పేముందని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీలో 25 ఏళ్లుగా ఉన్నానని, ఎప్పుడూ వేలెత్తి చూపించుకునే పని చేయలేదని, భవిష్యత్తులోను చేయనన్నారు.