పీడీ చట్టం ప్రయోగిస్తాం:సర్వశిక్షా అభియాన్ ఉద్యోగాల భర్తీలో దళారుల దందాపై సీఎం సీరియస్
అమరావతి:సర్వశిక్షా అభియాన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో దళారుల దందాపై ఒక తెలుగు పత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
ఈ విధమైన అక్రమాలకు పాల్పడేవారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, అరెస్ట్ చేయిస్తామని సిఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించి ఈ విధంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీలో దళారుల దందానే కాదు ఎఅలాంటి అక్రమాల్ని సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు.
''ఉదయం పత్రికలో కథనం చూసిన వెంటనే సంబంధిత అధికారుల్ని రమ్మని ఆదేశించా. ఎవరైనా తోక జాడించాలని చూస్తే కఠినంగానే వ్యవహరిస్తాం. పీడీ చట్టం కింద కేసులు పెడతాం. ఒకరిద్దరి మక్కెలిరగ్గొట్టిస్తే అందరూ దారికొస్తారు. మనం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ పారదర్శకత తెస్తున్నాం. అక్కడక్కడ ఒకరిద్దరు ఇలాంటి వాళ్లు తయారై ప్రభుత్వానికి అప్రదిష్ట తెస్తున్నారు''...అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయమై మంత్రి కళా వెంకటరావు మాట్లాడుతూ పత్రికలో వచ్చిన కథనం నిజమేనని, తమ శ్రీకాకుళం జిల్లాలోను అలాంటివి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీంతో తాను వెంటనే జిల్లా ఎస్పీని అప్రమత్తం చేశానని ఆయన చెప్పారు.