ఉద్యమకారిణి రోశమ్మ పింఛను నిలిపివేత
నెల్లూరు: సారా వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మకు వితంతు పింఛన్ను ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం నిలిపేసినట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో రోశమ్మ కలత చెంది అన్నపానీయాలు మానేసి మంచం పట్టింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలానికి చెందిన దూబగుంట రోశమ్మకు ఎన్టిఆర్ సిఎం ఉన్న కాలం నుంచి వితంతు పింఛన్ వస్తోంది.
పింఛన్ తక్కువ ఇస్తున్న సమయంలో కూడా రద్దు చేయకుండా కొనసాగించారని ఆమె తెలిపింది. అలాంటి పరిస్థితుల నుంచి అర్హులైన జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని, దీంతో నిరాశకు గురైనట్లు తెలిపింది. 80 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నానని, తనకు ఎలాంటి ఆధారం లేదని వాపోయింది. పింఛన్ నిలిపివేయడం తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయించాలని ఆమె వేడుకుంది.
తన పేరున మూడు ఎకరాల 40 సెంట్లు మాత్రం భూమి ఉందని, అయితే ఐదు ఎకరాలు పైబడి భూమి ఉందని పింఛన్ నిలిపివేసినట్లు అధికారులు చెప్తున్నారని వాపోయింది. ఈ విషయమై కలిగిరి ఎంపిడిఓ వెంకటశేషయ్యను వివరణ కోరగా, నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో 400కు పైగా పింఛన్లు విత్హెల్డ్లో ఉంచినట్లు తెలిపారు.
అయితే రోశమ్మ పింఛన్ విషయంలో ఆమెకు ఆన్లైన్లో ఐదు ఎకరాలకు మించి భూమి ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా రోశమ్మ అర్హురాలని నివేదిక ఇస్తే యధావిధిగా పింఛన్ అందుతుందని వివరించారు. పింఛన్ను తొలగించలేదని విత్హెల్డ్లో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.