మున్సిపల్ ఫలితాలతో ప్రజలు చంద్రబాబు వెంటిలేటర్ కూడా తీసేశారు : సజ్జల రామకృష్ణా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. అద్భుతమైన విజయాన్ని అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం పట్ల వైసిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరస్కరించారని వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు . సీఎం జగన్ తన 20 నెలల పాలన తో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఆయనకు అద్భుతమైన విజయాన్ని అందించారని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబుపై విరుచుకుపడిన సజ్జల
కార్పొరేషన్ మేయర్ లు , మునిసిపాలిటీల చైర్మన్ లను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తారని తెలిపిన సజ్జల రామకృష్ణారెడ్డి సామాజిక న్యాయం పాటించి అన్ని వర్గాలకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చేలా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేక ఇబ్బందులు పెట్టిందని, అయినప్పటికీ ప్రజలు మాత్రం జగన్ పక్షాన నిలిచారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు మోసాలను ప్రజలు తిప్పికొట్టారు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత 20 నెలలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయలేదని, కేవలం సమస్యలు సృష్టిస్తూ ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, చంద్రబాబు మోసాలను ప్రజలు ఇప్పుడు తిప్పికొట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
విజయవాడ,గుంటూరు ప్రజలను రెచ్చగొట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అమరావతిలో ఉద్యమం లేదని, చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజా ఫలితాలతో ప్రజలు చంద్రబాబు వెంటిలేటర్ కూడా తీసేశారు
అమరావతిలో చంద్రబాబు మోసాన్ని జగన్ చక్కదిద్దే ప్రయత్నం చేశారన్నారు. ఇక ప్రజలు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని పురపోరులో వైసిపికి విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇంతకాలం వెంటిలేటర్ పై ఉన్న చంద్రబాబుకు , తాజా ఫలితాలతో ప్రజలు ఆ వెంటిలేటర్ ను కూడా తీసేశారని విజయవాడ గుంటూరు ప్రజలు తమరు విషయాన్ని చూపించారని పేర్కొన్నారు.
అటు ప్రజల విశ్వాసం మాత్రమే కాకుండా, పార్టీ నాయకులు, కార్యకర్తల విశ్వాసాన్ని కూడా చంద్రబాబు కోల్పోయారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని పేర్కొన్నారు.