పది ఫెయిలయిన వారంతా పవన్ కళ్యాణ్ సంఘమే.. అందుకే వారంటే అభిమానం: పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలపై రగడ కొనసాగుతూనే ఉంది. పదో తరగతి పరీక్షా ఫలితాల పై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.
విద్యార్థులు ఫెయిల్ అవ్వటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అన్న పవన్ కళ్యాణ్
బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో పది గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉచితంగా రీకౌంటింగ్ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు వసూలు చేయరాదని రీకౌంటింగ్ కూడా ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఇంట్లో తల్లిదండ్రులదే తప్పని నెపం వేయడం ఏమాత్రం సమంజసం కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
ఇక ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదవతరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించటం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదవతరగతి ఫెయిల్ అయ్యారని, అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల అభిమానం చూపిస్తున్నారని, పాస్ కాని వారందరినీ తన సంఘమే అనుకుంటున్నారు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
పేపర్లు తయారు చేసింది దిద్దింది వైసీపీ నాయకులు కాదన్న పేర్ని నాని
చదువుకుంటే ఎవరైనా పాసవుతారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలి అని పేర్ని నాని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు చదువు రాదని పేర్ని నాని తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. పదవ తరగతి పేపర్ లు తయారు చేసింది, పేపర్లు దిద్దింది టీచర్ లే అని పేర్కొన్న పేర్ని నాని, వైసిపి నాయకులు కాదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలంటూ హితవు పలికారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ ల పైన కూడా మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.
మహానాడులో లోకేష్ వ్యాఖ్యలపైనా పేర్ని నాని
మహానాడు వేదికగా లోకేష్ ముసలి సరుకును వదిలించుకుంటాము అని చెప్పారని పేర్కొన్న పేర్ని నాని అందుకే బండారు సత్యనారాయణ మూర్తికి భయం పట్టుకుంది అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో లేని వ్యతిరేఖతను టీడీపీ వండి వార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పదో తరగతి పరీక్షా ఫలితాల పైన అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలో మంత్రి పేర్ని నాని ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.