చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు విక్రయించారని పిటిషన్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో పనిచేస్తున్న ఒక మంత్రి భార్యకు 14 ఎకరాలను అమ్మివేసిందని అభియోగం మోపుతూ తెలంగణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను సంఘం అధ్యక్షుడు ఏ రమేష్ బాబు దాఖలు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పి వెంకాయమ్మకు ఈ భూమిని పది కోట్ల రూపాయలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం విక్రయించిందని ఆరోపించారు. ఈ సొమ్మును రికవరీ చేసి డిపాజిట్ చేయించాలని, ఈ ఉదంతంపై విచారణ చేయించాలని ఆయన హైకోర్టును కోరారు.
ఈ విషయమై విచారించి రెండు వారాల్లో నిర్ణయం తెలియజేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్వి భట్ విచారించారు.