నాది హామీ: బాబు, జగన్ క్షమాపణకు డిమాండ్
గుంటూరు: గుంటూరు జిల్లాలోని చెన్నాయిపాలెం రైతులపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. చెన్నాయిపాలెం నుంచి దాదాపు రెండు వందల మంది రైతులు శనివారం ముఖ్యమంత్రిని కలిసారు. ఈ సందర్భంగా తమపై జరిగిన దాడిని వివరించారు.
గతంలో తమ ప్రాంతంలో సరస్వతి సిమెంట్స్కు అనుమతి ఇవ్వగా, మా భూములను సేకరించారని, ఇప్పటికే అక్కడ పరిశ్రమ ఏర్పాటుకాకపోవడంతో కలెక్టర్ అనుమతితో పంట వేసుకున్నామని వారు బాబుకువివరించారు.
అయితే దాదాపు నాలుగు వందలమంది ట్రాక్టర్లతో వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేయడంతోపాటు ఆడ, మగ అన్న తేడా లేకుండా విక్షక్షణారహితంగా తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై కిరోసిన్ పోసి తగులబెడతామంటూ వచ్చారని వారు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యపై అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
జగన్ ఇంటి ముందు రైతుల ధర్నా
గుంటూరు జిల్లా చెన్నయ్య పాలెం వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్న తమ భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన రైతులు లోటస్పాండ్లోని జగన్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. శనివారం 200 మంది రైతులు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు.
గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని తమ వద్ద భూములు తీసుకున్నారని, ఆ సమయంలో మూడు సంవత్సరాలలో ఫ్యాక్టరీని నిర్మించి అందులో తమకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సంస్థ ఇప్పటి వరకు అక్కడ ఫ్యాక్టరీ నిర్మించలేదన్నారు.
దీంతో ఇటు ఉన్న భూములు పోయి, ఇస్తానన్న ఉద్యోగం రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఖాళీగా పడి ఉన్న భూములను సాగు చేసుకుంటామని అక్కడికి వెళితే స్థానిక వైసీపీ నేతలు తమపై దాడులకు దిగారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై అకారణంగా దాడులకు దిగిన వైసిపి నేతల చర్యలను ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.