పంచ్ డైలాగులతో ఊపేసిన పవన్ కళ్యాణ్ (పిక్చర్స్)
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవిని సవాల్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటకలో బిజెపికి ప్రచారం సాగించారు. మంగళవారంనాడు ఆయన సభలకు ప్రజలు విరగబడ్డారు. తాను డైలాగులతో రెచ్చగొట్టడానికి రాలేదంటూనే కాంగ్రెసుపై విరుచుకుపడ్డారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
మోడీ అత్యుత్తముడని ఆయన అభివర్ణించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా మోడీ సామాన్యుడేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెసు పార్టీదేనని దుయ్యబట్టారు. తెలుగువాళ్లు ఎక్కడుంటే అక్కడికి వస్తానని చెప్పారు.
కాంగ్రెసును ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి మతతత్వ పార్టీ కాదని ఆయన కితాబు ఇచ్చారు. సర్వకులాల, సర్వ మతాల పార్టీ బిజెపి అని ఆయన అన్నారు. మోడీ అక్రమంగా అస్తులు సంపాదించిన దాఖలు లేవని ఆయన అన్నారు.
హెలికాప్టర్లో వచ్చాడని...
హెలికాప్టర్లో వచ్చాడు, నాలుగు డైలాగులు కొట్టి పోతున్నాడని అనుకోవద్దని, ఎలా వచ్చామనేది ముఖ్యం కాదని, లక్ష్యం ఏమిటనేది ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎల్లరగు నమస్కార అని..
ఎల్లరగు నమస్కార (అందరికీ నమస్కారం) అని కన్నడంలో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరి లాగా సినిమా డైలాగులు కొట్టి రెచ్చగొట్టడానికి రాలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ముక్కోణపు పోటీ..
తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉంటుందని, అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత ఎవరికి అధిక సీట్లు వస్తాయనేది తేలిపోతుందని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు హైదరాబాదులో అన్నారు.
అప్పుడు బాబు మంచివాడా..
2009లో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కెసిఆర్కు మంచివాడయ్యాడు, ఇప్పుడు తాము కలిస్తే అపవిత్రమా అని వెంకయ్య నాయుడు అన్నారు.
మీరు కలిస్తే పవిత్రులా..
మీరు ఎవరితో కలిస్తే వారు పవిత్రులా అని వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ప్రశ్నించారు.